'మోడీపై నమ్మకం పోతోంది, కిరణ్ కుమార్ రెడ్డి వద్దు'
హైదరాబాద్: నాలుగు నెలల స్వల్ప వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోడీ పాలన పైన ప్రజలకు నమ్మకం సడలిపోయిందని చెప్పటానికి ఉప ఎన్నికల ఫలితాలే సాక్ష్యమని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు బుధవారం అన్నారు. మంగళవారం వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు బిజెపికి దిమ్మతిరిగేట్లు చేశాయన్నారు.
మోడీ ప్రభుత్వం మాటలే తప్పించి చేతలలోసాధించిందేమీ లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల అభిమతానికి అనుగుణంగా పని చేయటం ప్రారంభించాలని, లేదంటే 2019లో జరిగే ఎన్నికల వరకూ నిలబడగలుగుతుందా? అన్న అనుమానాలు తలెత్తే అవకాశాలున్నాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోను ఆ పార్టీ వెనుకంజ వేసిందన్నారు.
మెదక్, నందిగామ ఉపఎన్నికల్లో కాంగ్రెస్కు లభించిన ఓట్లు పార్టీపై ప్రజల నమ్మకం సడలిపోలేదని చెప్పటానికి నిదర్శనమన్నారు. పార్టీ పుంజుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోయినవారంతా తిరిగి సొంత గూటికి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్లతో తాను మాట్లాడానని చెప్పారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మాత్రం అధినాయకత్వం దగ్గరకు రానీయకూడదన్నారు. కాంగ్రెస్లో ఉన్నంతకాలం పులిలా ఉన్న కేశవ రావు ఇప్పుడు కెసిఆర్ ముందు పెదవి విప్పడానికే భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు.