అఖిలప్రియకు వెంకయ్య సాయమేమిటీ, నిధుల వరద పారేనా?
నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు ఏపీ రాజకీయ సమీకరణాల్లో మార్పులకు కారణమౌతున్నాయి.
కర్నూల్: నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు ఏపీ రాజకీయ సమీకరణాల్లో మార్పులకు కారణమౌతున్నాయి. అయితే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకు అఖిలప్రియ నంద్యాల ఉప ఎన్నికల్లో బిజి బిజీగా గడిపారు. ఇప్పుడిప్పుడే తన శాఖ పనిలో ఆమె మునిగిపోయారు.అయితే పర్యాటక శాఖ పని మీద ఢిల్లీకి వెళ్ళిన మంత్రి అఖిలప్రియకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుండి సహకారం లభించింది. వెంకయ్య ఫోన్లతో కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు మంత్రి అఖిలప్రియకు లభించాయి.
Recommended Video
కర్నూల్ జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న భూమా అఖిలప్రియ ఇటీవలనే చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణంతో అఖిలప్రియకు క్యాబినెట్లో చోటు దక్కింది.
అనుకోని పరిస్థితుల్లో అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. అదే రకమైన పరిస్థితుల్లో ఆమెకు చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో చోటు దక్కింది. అతి చిన్న వయస్సులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళగా అఖిలప్రియ రికార్డులకెక్కింది.
నిధుల కోసం ఢిల్లీకి అఖిలప్రియ
నిధుల లేమితో అల్లాడుతున్న రాష్ర్టంలో పర్యాటకులను ఆకర్షించి తద్వారా ఆదాయాన్ని సముపార్జించాలని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. అఖిలప్రియ కూడా అందుకు తగినట్టుగానే పర్యటకశాఖ ద్వారా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు.పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా.. ఎండీ హిమాన్ష్ శుక్లాతో కలిసి ఢిల్లీ వెళ్లారు. నిధుల కోసం పలువురు కేంద్రమంత్రులను కలిశారు. రాష్ట్రానికి నిధులుఇవ్వాలని ఆమె మంత్రులను కోరారు.
వెంకయ్యనాయుడు అపాయింట్మెంట్ ఇలా..
అఖిలప్రియను విమానయానశాఖ మంత్రి అశోక గజపతిరాజు బ్రేక్ఫాస్ట్కు ఆహ్వానించారు. అప్పటికే ఆమెకు కేంద్ర పర్యాటకశాఖ మంత్రితో అపాయింట్మెంట్ లభించింది. సాంస్కృతికశాఖ మంత్రి అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు.. ఈలోగా అంతకుముందు రోజే అఖిలప్రియ ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడుని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. అశోకగజపతిరాజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో వెంకయ్యనాయుడు అపాయింట్మెంట్ ఖరారయ్యిందని...వెంటనే బయలుదేరి రావాలని కబురు అందింది.
రాజకీయంగా పేరు తెచ్చుకోవాలి
ఉప రాష్ర్టపతి నిలయంలో మంత్రి అఖిలప్రియను వెంకయ్యనాయుడు ఎంతో ఆహ్వానించారు. ఆమె తల్లిదండ్రులు భూమానాగిరెడ్డి, శోభానాగిరెడ్డితో తనకు ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు . రాజకీయంగా మంచి పేరు తెచ్చుకోవాలని.. ప్రజాసేవ చేస్తూ ఉంటే పేరు ఆటోమాటిక్గా వస్తుందని చెప్పారు. చిన్నవయసులోనే అప్పగించిన శాఖను సమర్థంగా నిర్వహించగలిగితే ముఖ్యమంత్రి కూడా మెచ్చుకుంటారని వెంకయ్య చెప్పారు.తాను శాఖపరమైన నిధులు.. పనుల కోసం వచ్చానని.. కేంద్ర పర్యాటక.. సాంస్కృతిక శాఖల మంత్రులను కలవాలని అనుకుంటున్నానని అఖిలప్రియ జవాబిచ్చారు. వెంటనే వెంకయ్యనాయుడు మంత్రులిద్దరికి ఫోన్ చేసి తన రాష్ర్టం నుంచి యంగ్ డైనమిక్ మంత్రి మిమ్మల్ని కలిసేందుకు వస్తున్నారని.. ఆమె అడిగిన పనులు చేసి పెట్టాలని చెప్పారు.. ఆమె కుటుంబంతో తనకు ఉన్న పరిచయాన్ని కూడా కేంద్రమంత్రులకు వివరించారు వెంకయ్య. వెంటనే ఆ మంత్రులు అఖిలప్రియకు అపాయింట్మెంట్ ఇచ్చారు.
నిధులిచ్చేందుకు కేంద్ర మంత్రుల హమీ
మంత్రుల దగ్గరకు వెళ్లినప్పుడు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. పనులను వెంటనే చేస్తామని చెప్పడంతో పాటు.. నిధులను కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వెంకయ్య ఫోన్కాల్ తో కేంద్రమంత్రులు అఖిలప్రియను సాదరంగా ఆహ్వానించడమే కాకుండా, శాఖలో అభివృద్ది కార్యక్రమాలపై ఆమె చూపిస్తున్న ఉత్సాహానికి ఆశ్చర్యపోయారు. తప్పనిసరిగా తమ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ప్రతిపాదనలు పంపితే నిధులు కూడా మంజూరు చేస్తామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని వెంకయ్యనాయుడు ఇచ్చిన హామీ అఖిలప్రియకు కొండంత అండగా ఉంది.