వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్: ఏపీలో కొత్తగా 14వేలకుపైనే, 80వేలు దాటిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు పదివేలకు తగ్గడం లేదు. తాజాగా, 46,650 నమూనాలను పరీక్షించగా.. 14,440 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21,80,634కు చేరింది. ఈ మేరకు వివరాలను ఏపీ వైద్యారోగ్యశాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 14,440 కొత్త కరోనా కేసులు
గత 24 గంటల్లో 14,440 కొత్త కేసులు నమోదు కాగా, కరోనా బారినపడి నలుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 14,542కు పెరిగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 3969 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 20,82,482కి చేరింది. కాగా, ఇప్పటి వరకు 3,21,47,031 నమూనాలను పరీక్షించారు.

ఏపీలో 80వేలు దాటిన యాక్టివ్ కేసులు
రాష్ట్రంలోని జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురం జిల్లాలో 1534 కరోనా కేసులు, చిత్తూరులో 1198, తూర్పుగోదావరిలో 1012, గుంటూరులో 1458, కడపలో 788, కృష్ణాలో 304, కర్నూలులో 1238, నెల్లూరులో 1103, ప్రకాశంలో 1399, శ్రీకాకుళంలో 921, విశాఖపట్నంలో 2258, విజయనగరంలో 614, పశ్చిమగోదావరిలో 613 మంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 83,610 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్న క్రమంలో వీకెండ్ కర్ఫ్యూ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ముందు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వెంకయ్యనాయుడుకు కరోనా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు. వైద్యుల సూచన మేరకు వారంపాటు ఐసోలేషన్లో ఉండనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఇటీవల తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. కాగా, 2020 సెప్టెంబర్లో వెంకయ్యనాయుడు తొలిసారి కరోనా బారినపడ్డారు.












Click it and Unblock the Notifications