రైలు ప్రమాదం: బోగీలో పొగపై భిన్నవాదనలు (పిక్చర్స్)
విజయనగరం: శనివారం సాయంత్రం ఓ బోగీలో పొగ వస్తోందని భయపడిన ఎనిమిది మంది కిందకు దూకి మరో రైలు కింద పడి మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లా శివారు గొట్లాంలో ఈ దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే. అలెప్పి-ధనబాద్ రైలులోని ఎస్ 1 బోగీ నుండి పొగ రావడాన్ని ప్రయాణీకులు గమనించారు.
గొలుసు లాగి వెంటనే రైలు దిగే ప్రయత్నం చేశారు. ఓ వైపు జవానులకు సంబంధించిన వస్తువులు ఉండటంతో అందరూ ఒకే ద్వారం నుంచి దిగవల్సి వచ్చింది. కిందకు దూకడం, వెనుక నుండి పలువురు తోయడం వంటి కారణాలతో ఎనిమిది మంది పక్కనున్న పట్టాల పైన పడ్డారు. అప్పుడే వచ్చిన రాయగడ-విజయవాడ పాసింజర్ కింద పడి ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
కాగా, ఎక్స్ప్రెస్లోని ఎస్-1 బోగీలో పొగలు వచ్చాయనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బోగీలో అసలు పొగలు రాలేదని, మంటలు వచ్చే ప్రశ్న అసలే తలెత్తదని రైల్వే, పోలీసు అధికారులు తెలిపారు. అయితే పొగలు రాకుండానే ప్రయాణికులు అంత ఆందోళన చెందుతారా? ప్రాణాల మీదికి తెచ్చుకుంటారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
ప్రమాదం 1
విజయనగరం గొట్లాం వద్ద ఒక ప్రమాదం నుండి బయటపడి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా రైలు నుండి దూకి మరో రైలు కింద పడి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలాన్ని పలువురు రాజకీయ నాయకులు సందర్శించారు. బాధితులను పరామర్శించారు.
ప్రమాదం 2
అలెప్పీ నుంచి జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్కు నడిచే బొకారో ఎక్స్ప్రెస్ (13352) శనివారం విజయనగరం రైల్వే స్టేషన్కు రెండు గంటలు ఆలస్యంగా సాయంత్రం ఆరు గంటలకు చేరుకుంది. ఐదు నిమిషాల తర్వాత తిరిగి బయలుదేరింది. విజయనగరం దాటి 4 కిలోమీటర్ల దూరంలో ద్వారపూడి-గొట్లాం కేబిన్ను దాటుతోంది.
ప్రమాదం 3
ఎస్-1బోగీలో బాత్రూమ్ సమీపంలో ఉన్న లగేజీ నుంచి పొగలు వస్తున్నట్లు ఓ ప్రయాణికుడు గమనించారు. దీంతో అప్రమత్తమై చైన్ లాగాడు. రైలు ఆగిన వెంటనే తన భార్యాపిల్లలు శ్వేతా సింగ్(34), శౌర్య కుణా (10), సందీప్ కుమార్ (2)లను కుడివైపు నుంచి కిందికి దించాడు.
ప్రమాదం 4
మరోవైపు నుండి తాను వస్తానని చెప్పాడు. ఎస్-1 బోగీలోనే ఉన్న అయోధ్య మేథో కూడా తన భార్య తారాదేవి కిందకు దించేశారు. ఈలోపు పొగల విషయం మిగిలిన ప్రయాణికులకు కూడా తెలిసింది. గందరగోళం చెలరేగింది. ప్రాణాలు దక్కించుకోవాలన్న తాపత్రయంతో ఎస్1తోపాటు మిగిలిన బోగీల్లో ఉన్న వారిలో కొందరు చకచకా రైలు దిగారు.
ప్రమాదం 5
కొందరు కుడివైపు నుంచి దిగగా మరికొందరు ఎడమవైపు నుంచి కిందికి దిగారు. ఎడమవైపు దిగిన వారంతా సురక్షితంగా ఉన్నారు. కానీ కుడివైపు నుంచి దిగిన వారు పక్కనే ఉన్న మరో ట్రాక్ దాటి ఖాళీ ప్రదేశం వైపు కదులుతుండగా, రాయగఢ్ - విజయవాడ ప్యాసింజర్ (472) వేగంగా దూసుకొచ్చి పట్టాలపై ఉన్న వారిని ఢీకొంది.
ప్రమాదం 6
బొకారో ఎక్స్ప్రెస్ ఆగిన ప్రాంతానికి కిలోమీటరు దూరంలో మలుపు ఉండడం, ప్రమాదం నుంచి తప్పించుకునే ఆదుర్దాలో ఉన్న ప్రయాణికులు విజయవాడ ప్యాసింజర్ను గమనించలేకపోయారు. వారు పట్టాలపైకి వెళ్లడం, వారిని ఢీకొని ప్యాసింజర్ రైలు సుమారు కిలోమీటరు దూరం ముందుకు వెళ్లిపోవడం క్షణాల్లో జరిగిపోయింది.
ప్రమాదం 7
ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. పొగలు వస్తున్నాయంటూ చైన్లాగి, రైలు ఆపిన మనోజ్ కుమార్ భార్య శ్వేతాసింగ్ (34), కుమార్తె శౌర్య (10), రెండేళ్ల కుమారుడు సందీప్ కుమార్ బలైపోయారు. అయోధ్య మేథో భార్య తారాదేవి (32) కూడా చనిపోయారు. వీరంతా బెంగళూరు నుంచి ఔరంగాబాద్ వెళ్తున్నారు.
ప్రమాదం 8
కార్తీక్ సాహూ (70), లోకేంద్ర (28), పాకలపాటి ఆదిరాజు (64) మరణించారు. ఆదిరాజు విజయనగరం జిల్లా సీతానగరం మండలం గుమ్మిడివరం గ్రామవాసి. ఆయన వైద్య పరీక్షల నిమిత్తం వారానికోసారి విజయనగరం వచ్చి వెళ్తుంటారు. శనివారం కూడా అలాగే వచ్చి తిరుగు పయనంలో తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అలెక్స్ టప్నో, కురుపాస్లను విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అలెక్స్ (25) చికిత్స పొందుతూ మరణించారు.
ప్రమాదం 9
ఈ దుర్ఘటనతో రెండు రైళ్లలోని ప్రయాణికులు చాలా సేపు తేరుకోలేకపోయారు. ఒకవైపు పొగలు వస్తున్నాయనే వార్తలు, మరోవైపు ప్రమాదంతో అసలేం జరుగుతోందో తెలియక తీవ్ర ఆందోళనలో పడ్డారు.
ప్రమాదం 10
ఆర్తనాదాలు, ఆక్రందనలతో ఆ ప్రదేశం మార్మోగిపోయింది. తల, చేతులు, కాళ్లు, మొండెం... ఇలా అవయవాలన్నీ ఛిద్రమై, శరీరం నుంచి వేరై పట్టాలపై విసిరేసినట్లు పడిన వైనం అందరినీ కలచివేసింది. ఇద్దరు చిన్నారుల మృతదేహాలు తునాతునకలయ్యాయి.