ఆస్పత్రుల దుస్థితిపై విడదల రజిని ఫైర్; మెరుగైన వైద్యం లక్ష్యంగా అధికారులకు మంత్రి ఆదేశం!!
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అధికారులను ఆదేశించారు. మంగళగిరి పట్టణంలోని ఏపీఐఐసీ భవన్లో అధికారులతో మంత్రి విడుదల రజిని సమీక్షా సమావేశం నిర్వహించారు. నేషనల్ హెల్త్ మిషన్ విభాగం ఉన్నతాధికారులతో మంత్రి విడదల రజిని నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆస్పత్రుల నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆస్పత్రుల నిర్వహణపై మంత్రి మండిపాటు.. పారిశుద్యం అధ్వానంగా ఉందని అసహనం
ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి రూ.16 వేల కోట్లు వెచ్చిస్తోందని, రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అధికారులు సహకరించాలని కోరారు. తాను పలు ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించానని, కొన్ని ఆసుపత్రుల్లో సరైన మరుగుదొడ్లు లేవని, అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని ఆసుపత్రుల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు.
నిర్లక్ష్యం సహించేది లేదు .. పీహెచ్సీ ల నిర్వహణపై మంత్రి ఆగ్రహం ..
ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచిస్తామని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని రజినీ హామీ ఇచ్చారు. బయోమెట్రిక్ విధానంలో తమ సమస్యలను ఏఎన్ఎంలు తన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పీహెచ్సీల పనితీరుపై మంత్రి రజినీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. పీహెచ్సీల్లోని వైద్యులు ఇంకా బయట మందులు కొనుగోలు చేయాలని రోగులకు సూచిస్తున్నారని అన్నారు. పిహెచ్సిలలో పరీక్షలు కూడా నిర్వహించటం లేదని, దీనిని సహించేది లేదని హెచ్చరించారు.
ప్రభుత్వాసుపత్రుల సమస్యలపై విడదల రజిని
ప్రభుత్వాసుపత్రుల్లో ఎలుకలు, దోమల సమస్య ఎందుకు కొనసాగుతోందని ఆమె ప్రశ్నించారు. ఎలుకలు, దోమల నివారణకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పిహెచ్సిలో 10 ప్రసవాలు నిర్వహించాలని వైద్యులకు విడదల రజిని ఆదేశించారు. ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా పరికరాల కొనుగోలులో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఆమె ఆదేశించారు. సమీక్షా సమావేశానికి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె నివాస్, అధికారులు హాజరయ్యారు.
అన్ని విభాగాల్లో ఏపీని ముందుంచాలి : మంత్రి విడదల రజిని
నాణ్యమైన వైద్యం అందించడం జగనన్న లక్ష్యమని, ప్రభుత్వం ఉన్నతాశయంతో, అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని విడదల రజిని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైద్య, ఆరోగ్య విషయాలపై స్పష్టత ఉందని, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లక్ష్యాలు పూర్తి కావాలని అన్ని విభాగాల్లోనూ ఏపీని ముందుంచాలని విడదల రజిని అధికారులకు సూచించారు. వైద్య సేవల విషయంలో ప్రజలు వంద శాతం సంతృప్తి చెందటమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.