ఆరోగ్యానికి సారా హానికరం .. ఆంధ్రరాష్ట్రానికి నారా హానికరం అన్న ఎమ్మెల్యే విడదల రజినీ
గత ప్రభుత్వ హయాంలో ఏపీలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగాయని చంద్రబాబు నాయుడు పాలనలో మద్యం వల్ల పల్లెలు కన్నీరు పెట్టాయని ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని మాట్లాడారు. అంతేకాదు ఏపీలో మద్యం వల్ల జరిగిన నష్టానికి బాధ్యుడు చంద్రబాబేనని, ఎన్నో కుటుంబాలలో కన్నీరు నింపిన ఆ పాపం చంద్రబాబుదే నని ఎమ్మెల్యే విడుదల రజిని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం కళ్ళులేని కబోది ప్రభుత్వం
చంద్రబాబునాయుడు మద్యం పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి మహిళలు ముఖాల్లో సంతోషం లేకుండా చేశారని ఆమె ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అత్యాచార కేసుల్లో 90 శాతం వరకు మద్యం మత్తులోనే చేశారని పోలీసుల రికార్డులు చెప్తున్నాయని అంటే అప్పట్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు విడదల రజిని. గతంలో టిడిపి ప్రభుత్వం కళ్ళులేని కబోదిలా వ్యవహరించిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటలు మద్యం విక్రయాలు కొనసాగుతున్న పట్టించుకునే దిక్కులేదని , అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ ఉండేవారని ఆమె పేర్కొన్నారు.
ఆరోగ్యానికి సారా ఎలా హానికరమో అలాగే ఆంధ్రప్రదేశ్ కి కూడా నారా హానికరం అన్న రజిని
టిడిపి హయాంలో గ్రామాల్లో ఒక నానుడి ఉండేదని చెప్పిన విడదల రజని ఏపీలో మంచినీళ్లు దొరకవు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుందని అనుకునేవారని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యానికి సారా ఎలా హానికరమో అలాగే ఆంధ్రప్రదేశ్ కి కూడా నారా హానికరం అని ఆమె పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ నారా వద్దు ఆ సారా వద్దు అని అన్నారని ఆమె పేర్కొన్నారు. అందుకే గత ఎన్నికల్లో టీడీపీని చావు దెబ్బ కొట్టారని రజిని చెప్పారు.
మద్య నిషేధం అమలు కోసం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం హర్షనీయం అన్న ఎమ్మెల్యే
ఇక ఏపీలో వైసీపీ పాలన మొదలైన నాటి నుండి దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తూ మహిళల ముఖాల్లో ఆనందాన్ని చూస్తున్నామని విడదల రజిని పేర్కొన్నారు. మద్యం వల్ల కుటుంబాలు ఆర్థికంగా ఎంతగా చితికిపోతున్నాయో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుసని, పాదయాత్ర సమయంలో ఆయన స్వయంగా మహిళల బాధను చూశారని అందుకే ఆయన సంపూర్ణ మద్యనిషేధం వైపు అడుగులు వేస్తున్నారని రజిని కొనియాడారు.