ఏపీ ఆస్పత్రుల్లో షాకింగ్- ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా దోపిడీ-పనిచేయని హెచ్చరికలు
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఓవైపు రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పుకుంటున్నా రోగులు మాత్రం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ నరకయాతన అనుభవిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల కౌరతతో ప్రైవేటును ఆశ్రయిస్తున్న వారికి అక్కడ మరిన్ని షాకులు తప్పడం లేదు. కరోనా పరీక్షల దగ్గర నుంచి చికిత్స వరకూ ప్రైవేటు ఆస్పత్రులు భారీగా దండుకుంటున్నాయి. అయినా నాణ్యత మాత్రం ఉండటం లేదని తాజాగా విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది.
ప్రైవేటు ఆస్పత్రుల్లో నరకయాతన
ఏపీలో ప్రస్తుతం కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ కూడా అదే రేంజ్లో కొనసాగుతోంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వ ఆస్పత్రులు ఎంతో మెరుగ్గా పనిచేస్తున్నాయి. అరకొరత సౌకర్యాలు ఉన్నా, నాణ్యమైన వైద్యులు ఉండటం, ప్రభుత్వం నిర్దేశించిన చికిత్సలే చేస్తుండటంతో ప్రభుత్వ ఆస్పత్రులకే జనం పరుగులు తీయాల్సిన పరిస్దితి. దీంతో పెరిగిన డిమాండ్ ప్రైవేటు ఆస్పత్రులకు వరంగా మారిపోతోంది. దీన్ని సొమ్ముచేసుకునేందుకు రంగంలోకి దిగిన ప్రైవేటు ఆస్పత్రులు రోగులకు నరకయాతన పెడుతున్నాయి.
కరోనా టెస్టుల నుంచి సీటీ స్కాన్ల వరకూ
కరోనా అనుమానాలతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే చాలు జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్కో సీటీ స్కాన్కు నాలుగైదు వేలు వసూలు చేస్తున్న ఆస్పత్రులు ఏపీలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టుకూ వేలల్లో వసూలు చేసే పరస్దితి ఉంది. అయినా ఫలితం వెంటనే వచ్చే అవకాశం లేకపోవడంతో జనం సీటీ స్కాన్ కోసం క్యూ కడుతున్నారు. దీంతో ఆస్పత్రులు డిమాండ్ను బట్టి రేట్లు పెట్టి వసూలు చేస్తున్నారు. వీరి దందా తాజాగా విజిలెన్స్ నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది.
అనుమతుల్లేని కోవిడ్ వైద్యం
ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రులతో పోలిస్తే ప్రైవేటు ఆస్పత్రులకు కరోనా చికిత్స కోసం ఈసారి భారీ ఎత్తున అనుమతులు ఇవ్వలేదు. దీంతో గతంలో ఇచ్చిన అనుమతులతో వైద్యం కొనసాగిస్తున్న వారు కొందరైతే, అసలు ఎలాంటి అనుమతి లేకుండానే వైద్యం కొనసాగిస్తున్న ఆస్పత్రులు మరెన్నో ఉన్నాయి. సీజన్ డిమాండ్ను సొమ్ముచేసుకుంటూ రోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసేస్తున్నారు. ఈ విషయం తాజాగా విజిలెన్స్ తనిఖీల్లో బయటపడింది. దీంతో ప్రభుత్వానికి చర్యల కోసం విజిలెన్స్ అధికారులు సిఫార్సు చేశారు.
పనిచేయని సర్కార్ హెచ్చరికలు
కోవిడ్ పరీక్షలకు, సీటీ స్కాన్కూ, వైద్యానికి నిర్ణీత ఖర్చులు నిర్ణయించినా ప్రైవేటు ఆస్పత్రుల్లో అస్సలు అమలు కాని పరిస్దితి. కరోనాతో రోగులు వేల సంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ను సొమ్ముచేసుకునేందుకు భారీ ఎత్తున ఆస్పత్రులు వసూళ్లకు దిగుతున్నాయి. అరకొర సౌకర్యాలతో, అనుమతుల్లేకుండానే చికిత్స మొదలుపెట్టేస్తున్నారు. అసలు విషయం తెలిసాక రోగులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం నిత్యం 104 కాల్ సెంటర్, 1902 కాల్సెంటర్కు కాల్ చేసి ఛార్జీలపై ఫిర్యాదులు చేయాలని కోరుతున్నా ఫోన్ చేస్తే దిక్కులేని పరిస్దితి. దీంతో రోగులు ఈ ఫిర్యాదుల కంటే ఎంతో కొంత చెల్లించి ఈ నాసిరకం వైద్యాన్నే ఆశ్రయించాల్సిన పరిస్దితులు దాపురించాయి.