నా పేరు చెప్పి అక్రమాలు చేస్తే-నాకు డబ్బు మీద ఆసక్తి లేదు: భీమిలిలో సెటిల్ అవుతా: సాయిరెడ్డి సంచలనం..!!
వైఎస్సార్ వర్దంతి సభలో రాజ్యసభ సభ్యుడు..వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వైఎస్సార్ మనసున్న మహా నేత అంటూ కీర్తించారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారన్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్నామని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీలో కష్టపడిన వారందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూములు ప్రజలకే చెందాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. దీనికి కొనసాగింపుగా..పార్టీకి చెందిన జీవీఎంసీ మేయర్, కార్పొరేటర్ల కు కర్తవ్య బోధ చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు.

ప్రతిపక్షాల విమర్శల ప్రస్తావన..
ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలని చెబుతూ....ఇక నుంచి అందరూ అభివృద్ధిపై దృష్టి పెట్టండంటూ సూచించారు. అవినీతి రహిత పాలన.. సమర్ధ నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం పని చేసిన వారికి అందరికీ పదవులు రారలేదని..అయినా, పదవుల విషయంలో అందరికి అవకాశాలు కల్పిస్తామంటూ సాయిరెడ్డి హామీ ఇచ్చారు. ఇదే సమయంలో విశాఖలో జరుగుతున్న వ్యవహారాల పైన కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల పైన ఆయన పరోక్షంగా స్పందించారు.

తన పేరుతో అక్రమాలు చేస్తే శిక్ష తప్పదు..
విశాఖలో చోటు చేసుకుంటున్న కొన్ని ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని వివరించారు. భూములు, పంచాయతీలు చేస్తున్నానని ప్రతిపక్షం ఆరోపిస్తోందని గుర్తు చేసారు. అయితే, తనకు డబ్బు మీద ఆసక్తి లేదని చెప్పిన సాయిరెడ్డి...హైదరాబాద్ లో ఉన్నది కూడా అద్దె ఇల్లే అంటూ వెల్లడించారు. తన చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. తన పేరు చెప్పి అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్షిస్తామంటూ పార్టీ నేతల సమావేశంలో హెచ్చరించారు.

సొంత ఇల్లు లేదు..భీమిలిలోనే సెటిల్ అవ్వాలని..
ఇందు కోసం రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తానని..ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని ప్రకటించారు. తనకు విశాఖలో స్థిరపడాలనే కోరిక ఉందంటూ మనసులో మాట బయట పెట్టారు. భీమిలి దగ్గర నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకుని జీవిస్తానని సాయిరెడ్డి వెల్లడించారు. తనకు ఆ ఒక్కటి తప్ప భూములు, భవంతులపై నాకు ఆశ లేదంటూ చెప్పుకొచ్చారు. విశాఖ, ఉత్తరాంధ్ర అభివృద్ధి మాత్రమే తన లక్ష్యమంటూ సాయిరెడ్డి వివరించారు.

సాయిరెడ్డి వ్యాఖ్యలు- విశాఖ వైసీపీలో హాట్ టాపిక్ గా..
అయితే, ఇప్పటి వరకు విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రస్తావించటం..తన పేరుతో ఎవరైనా అక్రమాలు చేస్తే ఫిర్యాదు చేయాలంటూ సాయిరెడ్డి చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీని ద్వారా పరోక్షంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా విశాఖలో అక్రమాలు జరుగుతున్నాయా అనే చర్చ మొదైంది. ఏకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తానని చెప్పటం ద్వారా..తన ఇమేజ్ డామేజ్ చేస్తున్న వారిని కంట్రోల్ చేయటంలో భాగంగానే సాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఇప్పుడు సాయిరెడ్డి వ్యాఖ్యల పైన విశాఖ పార్టీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు అంతర్గతంగా చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications