జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది: సాయిరెడ్డి విసుర్లు
సీఎం జగన్ మోహన్ రెడ్డి స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే జగన్ దావోస్ పర్యటనపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేసిన విమానం లండన్లో ల్యాండ్ అవ్వడంపై చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో జగన్ ను టార్గెట్ చేస్తూ షాకింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. బ్లాక్ మనీ దాచుకోవటానికి జగన్ దావోస్ పర్యటన అంటూ, ఇక లండన్ కు జగన్ ఎందుకు వెళ్లడంటూ టిడిపి నేతలు నిలదీస్తున్నారు.

జగన్ దావోస్ పర్యటన.. టీడీపీ విమర్శలపై మండిపడిన విజయసాయి రెడ్డి
ఇక తెలుగుదేశం పార్టీ నేతల విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా టిడిపిని, చంద్రబాబును టార్గెట్ చేశారు. జగన్ గారి దావోస్ టూరుపై టీడీపీ విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.2019 జనవరిలో లోకేశ్ టీం జ్యూరిచ్ నుంచి దావోస్ కు ట్రిప్పుకు 10 వేల డాలర్లుచెల్లించి హెలికాప్టర్లలో వెళ్లారని గుర్తు చేశారు. జగన్ గారు రోడ్డు మార్గాన ప్రయాణించారు. ఆనాటి ఖర్చుల సంగతి త్వరలోనే బయటపెడతాం అంటూ విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు.

బాబోరు దావోస్ వెళ్లే విమానంలో ఉండగానే లచ్చల్ కోట్ల పెట్టుబడులు.. సాయిరెడ్డి సెటైర్
ఇక పొలిటికల్ మిర్చి అంటూ చేసిన పోస్టులో గతంలో బాబోరు దావోస్ వెళ్లే విమానం లో ఉండగానే లచ్చల్ ,లచ్చల్ కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఎల్లో మీడియా ప్రచారం చేసిందంటూ విజయ సాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా పని చేస్తున్నారంటూ ముగ్గురు మీడియా అధినేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇక ప్రస్తుతం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రారంభం కాకముందే వైయస్ జగన్ సీఎం కనుక పెట్టుబడులు పెట్టకూడదు అంటూ ఆసక్తికర చర్చలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు.

చంద్రబాబు చిన్న పాలేరు పట్టాభి అంటూ టార్గెట్
ఇక జగన్ దావోస్ పర్యటన పై పట్టాభి చేసిన వ్యాఖ్యల పై మండిపడిన విజయసాయిరెడ్డి పట్టాభి అనే చంద్రబాబు చిన్న పాలేరు ముఖంనిండా కుళ్లు పులుముకుని జగన్ గారి దావోస్ పర్యటనపై విషం కక్కాడు అంటూ మండిపడ్డారు. నల్ల డబ్బు దాచేందుకు, స్విస్ బ్యాంకర్లను ప్రసన్నం చేసుకునేందుకే బాబు 18సార్లు అక్కడికి వెళ్లారని దేశమంతా తెలుసు అని పేర్కొన్నారు. పెట్టుబడుల పేరుతో వెళ్లి అక్కడ మెస్సు నడిపి ఏపీ పరువు తీశారు అంటూ ఎద్దేవా చేశారు.

దావోస్ టూర్ .. గతానికి, ఇప్పటికీ తేడా చెప్పిన సాయిరెడ్డి
అంతేకాదు గతంలో చంద్రబాబు దావోస్ పర్యటన పై పచ్చ మీడియా బిల్డప్పులు ఇచ్చిందని పేర్కొన్న విజయసాయిరెడ్డి, పాలకూర పప్పు, బెండకాయ వేపుడు, పులుసు, కొత్తిమీర అన్నం వడ్డించి పెట్టుబడులు తెచ్చామని చెప్పుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఇక మంచి వంటకాలు చేయించి వడ్డించారని, ఆంధ్ర రుచులు చూపించారని, దీంతో మీ రాష్ట్రం బాగుంది ఆతిథ్యం బాగుంది అని చెప్పారు అని విజయ సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. పచ్చ మీడియా కు టీడీపీ ఏది చేసినా అమోఘం.. వైసిపి ఏది చేసినా ఘోరం అన్నట్టుగా ఉందంటూ సెటైర్లు వేశారు.

చంద్రబాబు కుప్పం ఇల్లు కట్టుకోవటంపైనా సాయిరెడ్డి సెటైర్లు
ఇదే సమయంలో చంద్రబాబు ని టార్గెట్ చేసిన విజయ సాయి రెడ్డి కుప్పం లో చంద్రబాబు ఇల్లు కట్టుకునే విషయాన్ని ప్రస్తావించారు. దశాబ్దాలపాటు కుప్పంకు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఓటు అక్కడ లేదు. రిగ్గింగ్ కోసం వేల మంది తమిళుల్ని మాత్రం దొంగ ఓటర్లుగా చేర్పించాడు. కరకట్ట కొంపకు ఓటును మార్చుకున్నాడు గానీ కుప్పం వైపు కన్నెత్తి చూడలేదు. ఇంతకూ కుప్పంలో ఇల్లు కట్టుకుని ఉంటావా? ఎన్నికలయ్యాక అమ్మేస్తావా బాబూ? అంటూ ప్రశ్నించారు. ఇక మరో పోస్టులో బాదుడే బాదుడు అంటూ పార్టీని బతికించుకునే ప్రయత్నాల్లో చంద్రబాబు ఉంటే వాగుడే వాగుడు భరించలేం అంటూ ప్రాణభయంతో జనాలు పారిపోతున్నారు అంటూ చంద్రబాబు అంచనాలకు,వాస్తవాలు భిన్నంగా ఉన్నాయంటూ పోస్ట్ చేశారు.

దావోస్ టూర్ లో జగన్ బిజీబిజీ
ఇక దావోస్ పర్యటనలో జగన్ చాలా బిజీగా ఉన్నారు. పలువురు ప్రముఖులతో ఆయన ఇప్పటికే భేటీ అయ్యారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వివిధ అంశాలపైన కూడా గౌతమ్ అదానీతో చర్చించారు. వీరితో పాటుగా బిసిజి గ్లోబల్ చైర్మన్ హాన్స్ పాల్, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మొబిలిటీ అండ్ సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గోమేజ్, హెల్త్ విభాగాధిపతి డాక్టర్ శ్యామ్ బిషేన్ లతో జగన్ భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications