విజయమ్మ, పురంధేశ్వరి అటుఇటు: పోటీలో గట్టెక్కేనా?
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పోటీ చేస్తున్న విశాఖపట్నం, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేస్తున్న రాజంపేటలలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఇద్దరు ధీటైన మహిళా నేతలే. అయితే, వీరి గెలుపు నల్లేరుపై నడక కాదంటున్నారు.
విశాఖ నుండి గత ఎన్నికల్లో పురంధేశ్వరి గెలిచారు. ఇప్పుడు ఆమె రాజంపేట బరిలో నిలిచారు. విజయమ్మ పులివెందుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు విశాఖ నుండి నిలిచారు. గతంలో పురంధేశ్వరి నియోజకవర్గం నుండి విజయమ్మ, విజయమ్మ కుటుంబం ఇలాకా అయిన రాయలసీమ బరిలో పురంధేశ్వరి పోటీ చేస్తుండటం గమనార్హం.
దీంతో, సీమాంధ్రలోని 25 లోకసభ నియోజకవర్గాల్లో ఈ రెండు లోకసభ నియోజకవర్గాలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ప్రధాననగరమైతే, రాజంపేట రాయలసీమలో తిరుపతి, కడపల మధ్య విస్తరించిన ఉన్న లోకసభ నియోజకవర్గం. ఈ రెండు నియోజకవర్గాలు విశిష్టతను సంతరించుకున్నాయి.
వైయస్ మరణించేంత వరకు గడపదాటి ఎరుగని విజయమ్మ గత ఐదేళ్లలో రాజకీయాలు, సమస్యలపై అనర్గళంగా మాట్లాడే స్ధాయికి ఎదిగారు. అనూహ్య పరిస్ధితుల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆమె సీమాంధ్ర బిజెపి అధ్యక్షులు కంభంపాటి హరిబాబు నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్ధానాలు భీమిలి, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, గాజువాక, అనకాపల్లి, పెందుర్తి ఉన్నాయి.
విశాఖపట్నం ఎంపీగా ఉన్న కేంద్రమాజీ మంత్రి పురంధేశ్వరి రాయలసీమలో రాజంపేట ఎంపి స్ధానానికి మారారు. ఆమెను అందరూ చిన్నమ్మ అంటారు. పురంధేశ్వరి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి మారి రాజంపేట నుంచి పోటీ చేస్తున్నారు. రాజంపేటకు, బిజెపి పార్టీకి కొత్త అయిన పురంధేశ్వరి ఇప్పుడిప్పుడే క్రమంగా పుంజుకుంటున్నారు. టిడిపి మద్దతు ఉండటం గమనార్హం.
ఆమె కాంగ్రెస్ అభ్యర్ధి ఎ సాయిప్రతాప్, జగన్ పార్టీ అభ్యర్ధి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. రాజంపేట పరిధిలో ఏడు అసెంబ్లీలు రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు ఉన్నాయి. పురంధేశ్వరిఐదుసార్లు రాజంపేట నుంచి గెలిచిన సాయిప్రతాప్తో తలపడుతున్నారు.