టీడీపీ నేతల్ని నిలదీయండి-ఆ 34 చోట్ల ఓడించండి- ఉత్తరాంధ్ర ప్రజలకు సాయిరెడ్డి ట్వీట్
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు సాగుతున్న నేపథ్యంలో రాజకీయ నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రేపు విశాఖలో వైసీపీ గర్జన నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. విశాఖలో రాజధానిని వ్యతిరేకిస్తున్న టీడీపీని నిలదీయాలని ఆయన సూచించారు.
మూడు రాజధానుల ఉద్యమం ముమ్మరం అవుతున్న వేళ ఉత్తరాంధ్ర ప్రజలను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో ఏపీకి విశాఖ రాజధాని అవుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ నేతల్ని ప్రశ్నించాలని ఉత్తరాంధ్ర వాసుల్ని సాయిరెడ్డి కోరారు. ఉత్తరాంధ్ర వ్యతిరేక సెంటిమెంట్ ఆధారంగా టీడీపీకి ఇక్కడి 34 నియోజకవర్గాల ప్రజలు ఓటు వేయరాదని సాయిరెడ్డి సూచించారు. రేపు విశాఖ గర్జన నేపథ్యంలో ఉత్తరాంధ్ర వాసులకు సాయిరెడ్డి ఇచ్చిన ఈ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటికే విశాఖ రాజధానికి అనుకూలంగా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు ఉత్తరాంధ్ర నుంచి సరైన స్పందన రావడం లేదని భావిస్తున్న అధికార పార్టీ రేపు వైజాగ్ లో గర్జన నిర్వహిస్తోంది. నాన్-పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి కార్యక్రమాలు రూపొందిస్తోంది. అలాగే అమరావతి పాదయాత్రగా వస్తున్న రైతుల్ని అడ్డుకుంటామనే ప్రకటనలు ఇప్పిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా టీడీపీ నేతల్నినిలదీయండి అంటూ చేసిన ట్వీట్ తో రేపు ఉత్తరాంధ్రలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోబోతున్నాయనే ఉత్కంఠ నెలకొంది.
I urge the people of Uttarandhra to question the leaders of @JaiTDP as to why they oppose Vizag from becoming the Capital of Andhra Pradesh? None of the voters of the 34 constituencies should vote for TDP with anti-Uttarandhra sentiments.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 14, 2022