అక్కడ లోకేష్, ఇక్కడ చంద్రబాబు, ఇక అంతే: విజయసాయి రెడ్డి చురకలు
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పును కళ్లారా చూశామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయాలు నమోదు చేసిన నేపథ్యంలో విజయసాయి రెడ్డి మాట్లాడారు.
అక్కడ లోకేష్.. ఇక్కడ చంద్రబాబు ఓటమి: విజయసాయి రెడ్డి
చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని ఆయన మర్యాద పూర్వకంగా తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ దర్శి మినహాయించి అన్ని చోట్లా గెలిచామని తెలిపారు. ఈ ఫలితాలు వచ్చే ఎన్నికలకు సంకేతాలుగా భావించాలన్నారు. గత ఎన్నికల్లో కొడుకు లోకేష్ మంగళగిరిలో ఓడిపోతే.. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఓటమి పాలయ్యారంటూ ఎద్దేవా చేశారు. ఈ ఫలితాలను చంద్రబాబు అర్థం చేసుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు.
చంద్రబాబు ఇక హైదరాబాద్ నుంచే.. : విజయసాయి హితవు
చంద్రబాబుకు గ్రహణం పట్టిందని, ఇది రాష్ట్రానికి కార్తీక పౌర్ణమి రోజని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణ ప్రాంత ప్రజలు కూడా 98 శాతం వైసీపీకి మద్దతు ఇచ్చారన్నారు విజయసాయి రెడ్డి. చంద్రబాబు ఇంత వరకు తమ నాయకుడిపై చేసిన దుష్ప్రచారాన్ని.. ఇక హైదరాబాద్ నుంచి కొనసాగించాలనే తాను కోరుకుంటున్నాని అన్నారు. ఇలాంటి దుష్ప్రచారం వల్లే చంద్ర బాబును ప్రజలు ఛీత్కరిస్తున్నారని ఇప్పటికైనా ఆయన ఆలోచించుకోవాలని హితవు పలికారు.
లోకేష్, చంద్రబాబుకు చోటేది?: విజయసాయి చురకలు
లోకేష్ తననేం పీక్కుంటారు.. 48 గంటల్లో స్టే తీసుకు వస్తాను అంటున్నాడు. ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని లోకేష్ను శిక్షించాలని న్యాయస్థానాలను కోరుతున్నానని విజయ సాయిరెడ్డి తెలిపారు. న్యాయస్థానాలను ఎవరూ కించపరచకూడదు. తన కొడుకు ఎందుకూ పనికి రాకుండా పోయాడని చంద్రబాబు మనస్థాపం చెందుతున్నాడన్నారు. ఇప్పుడు తండ్రి, కొడుకులు ఇద్దరికీ స్థానాలు లేవని, కొత్త నియోజకవర్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విజయసాయిరెడ్డి.. చంద్రబాబు, లోకేష్లకు చురకలంటించారు
Recommended Video
ఈ ఎన్నికల్లో ఏం పీ.. లేదు కానీ, : అచ్చెన్నాపై మంత్రి అనిల్ ఫైర్
మరోమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు కార్పొరేషన్లోని 54 డివిజన్లలో వైయస్సార్సీపీ అభ్యుర్థులను గెలిపించిన ప్రజలకు మంత్రి అనిల్కుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. అభ్యర్థులతో టీడీపీ సరిగ్గా నామినేషన్ వేయించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఏజెంట్లను కూడా నిలుపుకోలేని పరిస్థితికి టీడీపీ దిగజారిపోయిందని విమర్శించారు. ఎన్నికల్లో టీడీపీ ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. తమను రాజీనామా చేసి రమ్మన్న అచ్చెన్నాయుడు.. ఈ ఎన్నికల్లో ఏం పీకారంటూ ధ్వజమెత్తారు. నిజంగా దమ్ముంటే టీడీపీలో మిగిలిన 19 మంది రాజీనామా చేసి గెలవాలని, ఉప ఎన్నికలకు రావాలని సవాల్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విసిరారు.