చంద్రబాబు దొంగలబడిలో ట్రైనింగ్ తీసుకుని దొరికిపోతున్నారు: దేవినేనిపై విజయసాయి రెడ్డి
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.చంద్రబాబు దొంగల బండిలో ట్రెయినింగ్ తీసుకున్న వాళ్లంతా దొరికిపోతున్నారని చురకలంటించారు.

చంద్రబాబు దొంగల బడిలో ట్రైనింగ్.. ఉమ బుక్కయ్యాడు
చంద్రబాబు దొంగల బడిలో ట్రైయినింగ్ తీసుకున్న వాళ్లంతా దొరికిపోతున్నారు. 1. దోచుకోవాలి. 2 అబద్ధాలు వరదలా పాలించాలి. 3. మార్ఫింగ్ వీడియోలు చూపాలి. ఆ తర్వాత నాకేపాపం తెలియదనాలి. ఉమా అడ్డంగా బుక్కయ్యాడు. బాబు 'మ్యానేజ్' చేయలేక చస్తున్నాడు' అంటూ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రాణదాతగా విశాఖ స్టీల్ ప్లాంట్
అంతకుముందు ట్వీట్లో విశాఖ ఉక్కు పరిశ్రమ గొప్పతనాన్ని విజయసాయి రెడ్డి ప్రశంసించారు. 'ఆంధ్రులకు గర్వకారణమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు దేశానికే ఊపిరిపోస్తోంది. కరోనా తీవ్ర రూపందాల్చి వేల మంది ప్రాణాలు హరిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మెడికల్ ఆక్సిజన్ అందిస్తూ కరోనా బాధితుల పాలిట ప్రాణదాతగా మారింది' అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

కేసులు ఇరికించారంటూ దేవినేని ఉమ
ఇది ఇలావుండగా, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియోను మార్ఫింగ్ చేశారంటూ తనపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ అధికారులు తనను ఇరికించేందుకే కేసు నమోదు చేశారని పిటిషన్లో దేవినేని పేర్కొన్నారు. పిటిషనర్ తరపున వాదనలు విన్న న్యాయస్థానం దర్యాప్తు అధికారిని మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిబంధన 41 కింద ఆయనకు రక్షణ కల్పించాలని సూచించింది. ఏప్రిల్ 29న మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని దేవినేని ఉమను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు దేవినేని ఉమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీ అధికారులను కోర్టు ఆదేశించింది. కాగా, టీడీపీ నేతలపై వైసీసీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ చంద్రబాబు సహా టీడీపీ నేతలు మండిపడుతున్నారు












Click it and Unblock the Notifications