చీప్ లిక్కర్ ఇస్తామంటూ చౌకబారు ప్రకటనలు; సోము వీర్రాజు టార్గెట్ గా సాయిరెడ్డి సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో కొనసాగుతున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన లిక్కర్ వ్యాఖ్యలపై నేతలు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా వైసిపి నాయకులు సోము వీర్రాజు ను టార్గెట్ చేస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉండి తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ని 50 రూపాయలకే అందిస్తామని ఇలాంటి చీప్ వ్యాఖ్యలు చేయడం ఏమిటని మండిపడుతున్నారు.
చీప్ లిక్కర్ వ్యాఖలను సమర్ధించుకున్న సోము వీర్రాజు: కేటీఆర్ కు చురకలు; మరో కొత్త డిమాండ్
రాష్ట్రంలో వేరే పార్టీ లను ఆదరించే పరిస్థితి లేదు
ఇక తాజాగా వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా సోము వీర్రాజు ను టార్గెట్ చేశారు. ప్రతిపక్ష పార్టీల పై తనదైన శైలిలో విరుచుకు పడే విజయసాయిరెడ్డి తాజాగా బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేశారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీలను ఆదరించే పరిస్థితి లేదని కుండ బద్దలు కొట్టారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో వేరే పార్టీలను ఆదరించే అవకాశం ఏమాత్రం లేదని పేర్కొన్న విజయసాయిరెడ్డి, జగన్ గారి సంక్షేమ పథకాలతో ప్రజలు వేరే పార్టీలను చూడడం లేదన్నారు.
చీప్ లిక్కర్ ఇస్తామంటూ చౌకబారు ప్రకటనలు: సోమును టార్గెట్ చేసిన సాయిరెడ్డి
దీంతో కొత్తగా ఏం చేయాలో పాలుపోక ప్రతిపక్ష పార్టీలు చిత్రవిచిత్రమైన రాజకీయాలు చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. చీప్ లిక్కర్ ఇస్తామంటూ చౌకబారు ప్రకటనలు గుప్పిస్తున్నారు అని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లిక్కర్ బ్రాండ్ ల గురించి కూడా వాపోతున్నారు అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని చెబుతూనే, మరోపక్క అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలను నడపడం ఏమిటీ అంటూ విమర్శించే వాళ్లు కూడా వీరే అంటూ విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా బిజెపి ని టార్గెట్ చేశారు.
అరుణాచల్ ప్రదేశ్ లో 15 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని ఖండించిన సాయిరెడ్డి
ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అనేక అంశాలపై స్పందించిన విజయసాయిరెడ్డి అరుణాచల్ప్రదేశ్లోని 15 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం అని పేర్కొన్నారు. చైనా దురాక్రమణను గట్టిగా ఎదుర్కోవాలని విజయసాయిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమస్యను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తాలని సూచించారు. ఏ దేశం యొక్క సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రత ఉల్లంఘించబడకూడదు అంటే ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఆసక్తికరమైన పోస్ట్
అంతేకాదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన కూడా ఆయన పోస్ట్ పెట్టారు. నిర్మాణం కోసం నాణ్యమైన విశాఖ స్టీల్ ను సరఫరా చేయడం ద్వారా దేశవ్యాప్తంగా అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు బలాన్ని అందిస్తోందని విజయసాయి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇటీవల ప్రారంభించబడిన కాన్పూర్ మెట్రో ప్రాజెక్టు తో ఒప్పందం చేసుకోవడం, అందులో భాగం కావటం మనకు గర్వకారణమని పేర్కొన్న ఆయన, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నో ప్రైవేటైజేషన్ అంటూ పేర్కొన్నారు.