రాజీనామా లేఖతో సాయిరెడ్డి-జగన్ మౌనం వెనుక బిగ్ రీజన్?
వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయిరెడ్డి నిన్న సంచలన నిర్ణయం ప్రకటించారు. ఎవరూ ఊహించని విధంగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచే తప్పుకుంటానని ప్రకటించేశారు. దీంతో ఆయన షాకింగ్ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై చర్చ జరుగుతోంది.
అదే సమయంలో సాయిరెడ్డి నిర్ణయంపై ఇన్నాళ్లు ఆయన ప్రాతినిథ్యం వహించిన వైసీపీ మౌనంగా ఉండిపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయినా ఇవేవీ పట్టించుకోకుండా ఇవాళ రాజీనామా లేఖను స్పీకర్ కు అందించేందుకు సాయిరెడ్డి రెడీ అవుతున్నారు.

దశాబ్దానికి పైగా వైసీపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి ఎంపీ పదవిని మూడేళ్లకు ముందే వదులుకోవాలని నిర్ణయించుకోవడం, ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. సాయిరెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రభావం ఏ స్ధాయిలో ఉండబోతోందన్నది ఇప్పటికిప్పుడు తెలియకపోయినా ఆయన సొంత పార్టీ వైసీపీకి మాత్రం తీవ్ర నష్టమే అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఆయన ఇవాళ రాజ్యసభ ఛైర్మన్ ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పించేందుకు సిద్దమవుతున్నారు.
మరోవైపు విజయసాయిరెడ్డి రాజీనామాపై ఇన్నాళ్లూ తాను నడిచిన పార్టీ వైసీపీ స్పందించలేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీలో చాలా మంది నేతలు సాయిరెడ్డి నిర్ణయంతో షాక్ లో ఉన్నారు. అధినేత జగన్ నుంచి కానీ, పార్టీలో ఇతర పెద్దలు, ప్రజాప్రతినిధులు, మాజీలు ఇలా ఎవరూ సాయిరెడ్డి రాజీనామాపై స్పందించడం లేదు. అసలు దీని వెనుక ఏముందనే చర్చ తేలితే తప్ప దీనిపై ఎవరూ మాట్లాడే పరిస్ధితి లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. గతంలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఇలాగే రాజీనామా చేసి వెళ్లిపోయినప్పుడు స్పందించిన జగన్ ఇప్పుడు మౌనంగా ఉండటం వెనుక రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
సాయిరెడ్డి రాజీనామాకు అందరూ ఊహిస్తున్న కారణం బీజేపీ పెద్దల నుంచి ఉన్న ఒత్తిడే అనుకుంటే మాత్రం జగన్ స్పందించకుండా సైలెంట్ గా ఉండిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా తనకు, తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న జగన్ కూడా స్పందించకపోతే సాయిరెడ్డికి ఇది మరో షాక్ కాబోతోంది. నిన్నటి ట్వీట్ లో మాత్రం జగన్ కు, ఆయన సతీమణి భారతికి మాత్రం కృతజ్ఞతలు తెలిపారు. అంతిమంగా బీజేపీ భయంతోనే సాయిరెడ్డి రాజీనామాపై జగన్ స్పందించడం లేదన్న చర్చ మాత్రం మొదలైంది.












Click it and Unblock the Notifications