రాజధాని రైతులకు విజయసాయి సలహా: ఆయన్ను దూరం పెట్టండి అంటూ
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి రాజధాని అమరావతి విషయంలో జరుగుతున్న రగడ నేపధ్యంలో మరోమారు చంద్రబాబును టార్గెట్ చేసి మరీ చెలరేగారు . నిన్నటికి నిన్న రాజధాని రైతులకు భరోసా కల్పించటం కోసం, అండగా ఉన్నానని చెప్పటం కోసం రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. రైతులు చంద్రబాబు మాటలను నమ్ముతారేమో అని భావించిన విజయసాయి ఈ క్రమంలో రాజధాని రైతులకు సలహా ఇచ్చారు.
జై అమరావతి..రాజధాని ఇక్కడే ఉండాలి: విశాఖకు వ్యతిరేకం కాదు: అండగా ఉంటాం.. చంద్రబాబు హామీ!
రాజధాని రైతులకు సలహా .. చంద్రబాబుపై విమర్శలు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాత్రనక ,పగలనకా రాజధాని గ్రామాల రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇక రాజధాని ప్రాంత రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని విజయసాయి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
చంద్రబాబును నమ్మొద్దు అన్న విజయసాయి సలహా
తుళ్లూరు రైతులు అనవసరంగా చంద్రబాబును నమ్ముతున్నారని , చంద్రబాబును నమ్మడం కంటే అమాయకత్వం మరొకటి ఉండదని విజయసాయిరెడ్డి అన్నారు. తన బంధువర్గాల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఇప్పటికే ఒకసారి రైతులను చంద్రబాబు ఫణంగా పెట్టారని విజయసాయి పేర్కొన్నారు .చంద్రబాబును నమ్మకండి అని ఆయన సలహా ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ రైతులను అడ్డుపెట్టుకుని డ్రామాలు ఆడిస్తున్నారని విజయసాయి విమర్శించారు. రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని పేర్కొన్న విజయసాయి చంద్రబాబును దూరం పెడితే అన్నీ సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
ఇన్సైడర్ ట్రేడింగ్ పై విమర్శలు చేసిన విజయసాయి
ఇక నిన్నటి వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ పై విమర్శలు చేసిన విజయసాయి రాజధాని మార్పు అంత తేలిక కాదని సుజనా చౌదరి సణుగుతున్నాడు. బ్యాంకులకు ఎగ్గొట్టిన 5 వేల కోట్ల సంగతి ముందు తేల్చి, రాజధాని గురించి మాట్లాడితే బాగుంటుందని ప్రజలు అంటున్నారు. అమరావతిలో కొన్న 300 ఎకరాలకు పాత ధర కూడా వచ్చే అవకాశం లేదని నిద్ర పట్టడం లేదు కాబోలు అంటూ సుజనా చౌదరి పై మండిపడ్డారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు పై, టీడీపీ నాయకులపై ఆయన నిప్పులు చెరిగారు.
వైసీపీ నేతలపై రాజధాని రైతుల ఆగ్రహం .. విజయసాయి సలహా పాటిస్తారా ?
కానీ ప్రస్తుతం రాజధాని ప్రాంత రైతులు వైసీపీ సర్కార్ పై, వైసీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సీఎం జగన్ చేసిన ప్రకటన వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో తమకు అండగా నిలుస్తున్న చంద్రబాబును ఆదరిస్తున్నారు . ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు సైతం ఇప్పుడు జగన్ తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు.