బోటు ప్రమాదం: 17 మందిది ఒంగోలు, ఆ 4 కుటుంబాల్లో విషాదం
కృష్ణానదిలో బోటు మునిగిన ప్రమాదంలో ఒంగోలుకు చెందిన నాలుగు కుటుంబాల్లో పెను విషాదం మిగిలింది. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. అయితే ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్
అమరావతి: కృష్ణానదిలో బోటు మునిగిన ప్రమాదంలో ఒంగోలుకు చెందిన నాలుగు కుటుంబాల్లో పెను విషాదం మిగిలింది. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. అయితే ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఆదివారం సాయంత్రం అమరావతికి సమీపంలో కృష్ణా నదిలో బోటు మునిగిన ప్రమాదంలో 22 మంది మరణించారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఒంగోలుకు చెందిన వాకర్స్ క్లబ్ సభ్యులు ప్రతి ఏటా కార్తీక మాసంలో విహరయాత్రకు వెళ్తుంటారు. ఈ విహర యాత్రే ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో ఒంగోలు పట్టణంలో విషాదం చోటుచేసుకొంది.
ఆ నాలుగు కుటుంబాల్లో విషాదం
ఒంగోలు పట్టణానికి చెందిన నాలుగు కుటుంబాల్లో పెను విషాదం నిండింది. ఈ నాలుగు కుటుంబాల్లో మూడు కుటుంబాల్లోని దంపతులు చనిపోయారు.కోటేశ్వరరావు- వెంకాయమ్మ, ఆంజనేయులు-రమణమ్మ, సీతారామయ్య-అంజమ్మ, కటారి సుధాకర్, అతని భార్య భూలక్ష్మి, కుమార్తె బిందుశ్రీ మృతి చెందారు. వీరంతా ఒంగోలు పట్టణానికి చెందినవారు కావడంతో పట్టణంలో విషాదం చోటుచేసుకొంది.
కార్తీక మాసంలో విహర యాత్ర
ఒంగోలుకు చెందిన 'ది ఒంగోలు వాకర్స్ క్లబ్' సభ్యులు ప్రతి ఏటా కార్తీక మాసంలో విహార యాత్రకు వెళుతుంటారు. ఈసారి కార్తీక మాసంలో చివరి ఆదివారం రోజున ఒంగోలు నుంచి 40 మంది ఒక బస్సులో, 20 మంది మరో మినీ బస్సులో బయలుదేరారు. అమరావతిలో అమరలింగేశ్వరుడిని దర్శించుకున్నారు.కృష్ణమ్మకు హరతిని చూసేందుకు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకొన్నారు.
ఒంగోలులో విషాద వాతావరణం
కృష్ణా నదిలో పడవ మునిగిన ఘటనలో ఒంగోలు పట్టణంలో విషాద వాతావరణం చోటుచేసుకొంది. పట్టణంలో ఎక్కడ చూసినా మృతుల బంధువుల రోదనలు కన్పిస్తున్నాయి. పట్టణంలో ఎవరిని కదిపిన మృతులతో తమ అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు.బోటు మునిగిన ప్రమాదంలో 17 మంది ఒంగోలు పట్టణానికి చెందినవారే కావడం గమనార్హం, ఈ ఘటనలో 22 మంది మరణించారు.
బోటు ప్రమాద మృతులకు అంత్యక్రియలు
కృష్ణా నదిలో బోటు మునిగిన ఘటనలో 22 మంది చనిపోతే అందులో 17 మంది ఒంగోలుకు చెందినవారే. అయితే వీరి అంత్యక్రియలను ఒంగోలు పట్టణంలోని మహ ప్రస్థానంలో నిర్వహించారు. బంధు మిత్రులు, స్నేహితుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు.