విజయవాడ కరోనా బాధితుడి ఆక్రందన..సెల్ఫీ వీడియోలో సంచలన కామెంట్లు
కరోనా మహమ్మారిపై కారు కూతలు కూతలు, తప్పుడు పోస్టులు పెట్టేవాళ్లు పవన్ కల్యాణ్ అంతటివాళ్లయినాసరే పోలీసులు, సంస్థలు వదిలిపెట్టడంలేదు. కరోనా బాధితలు, పాజిటివ్ పేషెంట్ల వివరాలు బయటికి వెల్లడించొద్దంటూ ప్రభుత్వాలు సైతం సూచనలు చేశాయి. అయినాకూడా సోషల్ మీడియాలో నిందారోపణలు ఆగడంలేదు. ప్రముఖ సింగర్ కనికా కపూర్ ఎపిసోడ్ తర్వాత బాధితుల పట్ల జనం ఇంకాస్త కఠినంగా వ్యవహరించడం మొదలైంది. అయితే అందర్నీ ఒకే గాటునకట్టి విమర్శలు చేయొద్దని, ఎమోషనల్ గా ఆడుకోవద్దంటూ విజయవాడ కరోనా బాధితుడు ఆక్రందన వెళ్లగక్కాడు.
కరోనా బాధితుల పేర్లు వెల్లడించొద్దని ప్రభుత్వం సూచించినప్పటికీ.. తన పేరును హేమంత్గా వెల్లడించిన ఆ విద్యార్థి.. గతవారమే పారిస్ నుంచి వచ్చానని తెలిపాడు. అయితే రెండు ఎయిర్ పోర్టులు దాటి, వందల కిలోమీట్లు కారులో ప్రయాణించి అతను వైరస్ ను వ్యాప్తి చేశాడని, పోలీసులకు దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడని కొన్ని చానెళ్లలో వార్తలు రావడం పట్ల హేమంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఢిల్లీ ఎయిర్ పోర్టులోనూ కరోనా లక్షణాలు బయటపడలేదని, ఇంటికొచ్చిన తర్వాత అనుమానంతో తానే స్వచ్ఛందంగా ప్రభుత్వాధికారుల్ని సంప్రదించానని చెప్పాడు.
తన గురించి ప్రసారమైన తప్పుడు వార్తల్ని ఖండిండించిన హేమంత్..''మీరు నన్ను సపోర్ట్ చేయండి. అంతేకాని నన్ను, నా కుటుంబాన్ని ఎమోషనల్ గా బ్లేమ్ చేయొద్దు. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. నేను త్వరగా కోలుకుని బయటకు వచ్చాక, కరోనా విషయంలో చాలామందికి మోటివేషన్ గా ఉండాలని కోరుకుంటున్నా''అని వేడుకున్నాడు. మొదటి నుంచీ అసలేం జరిగిందో అతనిలా వివరించాడు..
''అందరికీ నమస్తే.. నా పేరు హేమంత్, వయసు 24. ప్యారిస్ నుంచి విజయవాడకు వచ్చిన కరోనా బాధిత విద్యార్థిని నేనే. ఈనెల 16న ఉదయం 9గంటలకు ప్లేన్ లో పారిస్ నుంచి ఢిల్లీ వచ్చాను. ఢిల్లీలో స్క్రీనింగ్ జరిగింది. అప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపించ లేదు. దీంతో అధికారులు నన్ను పంపేశారు. ఈనెల 17న విమానంలోనే హైదరాబాద్ వచ్చాను. అక్కణ్నుంచి ప్రైవేట్ క్యాబ్ తీసుకుని ఒక్కడినే విజయవాడకు వచ్చేశాను. విదేశాల నుంచి వచ్చానని తెలియగానే విజయవాడ మున్సిపల్ విజిలెన్స్ టీమ్ మా ఇంటికి వచ్చింది. 14రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. ఆ మేరకు నేను ఇల్లు కదల్లేదు. రెండ్రోజులకే నాకు ఫీవర్ వచ్చింది. దీంతో స్వయంగా నేనే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పాను. టెస్టు చేయించుకుంటే నాకు పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మెడికేషన్ లో ఉన్నాను. మీరు నన్ను సపోర్ట్ చేయండి. అంతేకాని నన్ను, నా కుటుంబాన్ని ఎమోషనల్ గా బ్లేమ్ చేయొద్దు. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. నేను త్వరగా రికవర్ అయ్యి బయటకు వచ్చి చాలామందికి మోటివేషన్ గా ఉండాలని కోరుకుంటున్నా'' అని హేమంత్ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది.
ఏపీలో ఆదివారం నాటికి ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో వెయ్యి మందికిపైగా అనుమానితులకు టెస్టులు నిర్వహించారు. 711 మంది తమ సొంత ఇళ్లలోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండగా, 36 మంది పేషెంట్లు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే కరోనా వ్యాప్తి ఏపీలో తక్కువగానే ఉందని, విదేశాల నుంచి వస్తున్నవారిపై గట్టి నిఘా పెట్టడం వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెప్పారు.