మహానాడు నుంచి తిరిగొస్తుంటే రోడ్డు ప్రమాదం: ప్రాణాలతో బయటపడ్డ బెజవాడ కార్పోరేటర్
అమరావతి: విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ 44వ డివిజన్ కార్పోరేటర్ కాకు మల్లిఖార్జునరావు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. తిరుపతిలో జరిగిన మూడు రోజుల మహానాడు కార్యక్రమానికి తన కుటుంబ సభ్యులతో సహా హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద సోమవారం ఉదయం ప్రమాదానికి గురైంది.
తెల్లవారుజామున కారు డ్రైవర్ తనకు నిద్రవస్తుందని చెప్పగా, కారును కార్పోరేటర్ మల్లిఖార్జున రావే స్వయంగా నడుపుతున్నారు. ఈ క్రమంలో కారు ఆచార్య నాగార్జున వర్సిటీకి సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఆయన భార్య తదితరులకు తీవ్రగాయాలు కాగా, వారిని విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరిలించి చికిత్సను అందిస్తున్నారు.
అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుండగా, సీటు బెల్ట్ పెట్టుకోడవమే తన ప్రాణాలు పోకుండా కాపాడిందని మల్లిఖార్జునరావు మీడియాతో మాట్లాడిన సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా తిరుపతిలో శుక్రవారం ప్రారంభమైన టీడీపీ పార్టీ పండుగ మహానాడు మూడు రోజుల పాటు జరిగింది.
ఈ మహానాడు కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. మహానాడు కార్యక్రమంలో ప్రతినిథుల హాజరు, చర్చల నాణ్యత, నేతల భాగస్వామ్యం వంటి అంశాలు ఆకట్టుకున్నాయి. మండిపోతున్న ఎండల్లో మూడు రోజులు పాటు మహానాడు అవసరమా? అని కొంతమంది పెదవి విరిచినా, ఎక్కువ మంది హాజరవడం పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది.
మూడు రోజుల మహానాడులో మొత్తం 28 తీర్మానాలపై చర్చలు జరిగాయి. వాటిపై 146 మంది పార్టీ నేతలు మాట్లాడారు. మొత్తం 30 గంటల పాటు సమావేశాలు జరిగాయి. మరోవైపు తెలంగాణలో టీడీపీ బలహీనపడటంతో ఆ ప్రాంత నేతలు కొంత మనోస్థైర్యం తగ్గినట్లు అనిపించినా మహానాడులో ఉత్సాహంగా పాల్గొన్నారు.