అష్టమి నాడు దుర్గాదేవిగా బెజవాడ కనకదుర్గమ్మ-భక్తుల రద్దీ-డీజీపీ సవాంగ్ దర్శనం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నవరాత్రుల అష్టమి రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు.
అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది... శిష్టరక్షణ చేయడానికి అవతరించిన దుర్గాదేవి నిజరూపంగా భక్తులకు దర్శనమిస్తుంది.

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. డీజీపీకి అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం డీజీపీ వేద పండితుల వేద ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని వాటిని భక్తులు పెద్ద మనసుతో క్షమించాలని తెలిపారు. దసరా శరన్నవరాత్రిలో పోలీసుల పాత్ర చాలా కీలకమైందని అన్నారు. విధి నిర్వహణ నిర్వహిస్తున్న పోలీసులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
దసరా నవరాత్రుల సందర్భంగా నిన్న మూలా నక్షత్రం రోజు సీఎం జగన్ అమ్మవారి దర్శనం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇప్పటికే పలువురు వీఐపీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దర్శనం చేసుకున్నవారిలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో నవరాత్రులు ముగిసిపోనున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దేవస్ధానం అధికారులు కూడా పోలీసులకు తగు సూచనలు ఇస్తున్నారు. దీంతో నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా సాగిపోతున్నాయి.












Click it and Unblock the Notifications