Vijayawada lulu mall: విజయవాడలో లులూ మాల్ కు సర్కార్ షాక్-హైకోర్టులో..!
దుబాయ్ కు చెందిన లులూ గ్రూప్ విజయవాడలో నిర్మించ తలపెట్టిన భారీ మాల్ (vijayawada lulu mall) విషయంలో ఇవాళ ఎదురుదెబ్బ తగిలింది. నగరం నడిబొడ్డున దాదాపు 400 కోట్ల విలువైన భూమిని లులూ మాల్ కోసం కేటాయించాలని గతంలో కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ హైకోర్టులో దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. దీంతో గతంలో విశాఖలో వైసీపీ హయాంలో షాక్ తిన్న లులూకు ఇవాళ విజయవాడలో షాక్ తగిలినట్లయింది.
విజయవాడలోని ఆర్టీసీ పాత బస్టాండ్ ఎక్స్ రోడ్ లో ఆర్టీసీకి చెందిన స్థలంలో లులూ మాల్ ఏర్పాటుకు గతంలో చంద్రబాబు సర్కార్ అనుమతి ఇచ్చింది. దీనిపై నగరంలో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాదాపు 400 కోట్లు విలువైన స్థలాన్ని ప్రైవేటు సంస్ధ అయిన లులూ మాల్ కు కేటాయించడం ఏంటన్న ప్రశ్నలు వినిపించాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కేబినెట్ భేటీలోనే ఈ విషయాన్ని ప్రశ్నించారు. అదే సమయంలో హైకోర్టులోనూ దీనిపై ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది.

విజయవాడలో విలువైన భూముల్ని లులూ మాల్ కోసం ప్రభుత్వం కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిల్ పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. రైతు నేత వడ్డే శోభనాద్రిశ్వరరావు హైకోర్టులో ఈ పిల్ వేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం లులూ మాల్ కు ఇచ్చిన ఆర్టీసీ భూముల్ని వెనక్కి తీసుకుంటామని హైకోర్టుకు హామీ ఇచ్చింది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టత కూడా ఇచ్చింది. దీంతో హైకోర్టు ఈ కేసు విచారణను ముగించింది. హైకోర్టులో చెప్పిన మేరకు త్వరలో ఆర్టీసీ భూముల్ని లులూకు ఇస్తూ గతంలో జారీ చేసిన జీవోను ఉపసంహరించుకుంటూ మరో ఉత్తర్వు జారీ చేయనుంది.












Click it and Unblock the Notifications