గ్రేటర్ హోదా!: త్వరపడండి, బెజవాడలో ప్లాట్ కొనాలనుకుంటున్నారా?
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధానిగా ప్రస్తుతం సేవలందిస్తోన్న విజయవాడ రూపురేఖలు మారనున్నాయి. అతి త్వరలోనే విజయవాడ చుట్టుపక్కల ఉన్న 32 గ్రామాలను తనలో కలుపుకుని విజయవాడ సిటీ అతి పెద్ద కార్పోరేషన్గా అవతరించబోనుంది. దీనికి సంబంధించిన డ్రాప్ట్ జీవో రూపుదిద్దుకుంటోందని తెలిసింది.
ఈ డ్రాప్ట్ ద్వారా విజయవాడ రూరల్, గన్నవరం, ఇబ్రహీంపట్నం, పెనమలూరు మండలాల పరిధిలోని మొత్తం 32 గ్రామాలను గ్రేటర్ పరిధిలోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి సెప్టెంబర్ 3వ తేదీన గ్రేటర్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం విజయవాడ వీఎంసీ(విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్)గా సేవలు అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ నగరపాలకసంస్థలో విలీనం కానున్న గ్రామాల్లో ఇప్పటికే జనాభా లెక్కలను సేకరించినట్లుగా తెలుస్తోంది. తొలుత 14 గ్రామాలను మాత్రమే విలీనం చేస్తున్నట్లు భావించినప్పటికీ, చివరకు 32 గ్రామాలను విలీనం చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
దీనికి సంబంధించిన జీవో విడుదలైన తర్వాత విజయవాడలో విలీనం కానున్న 32 గ్రామాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని విడదల వారీగా నగరపాలకసంస్ధ పరిధిలోకి తీసుకొస్తారు. అయితే గ్రేటర్ విజయవాడలో విలీనమయ్యే 32 గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయితీ సిబ్బందిని నగరపాలక సంస్ధలోకి బదలాయిస్తారా? అనే దానిపై స్పష్టత రాలేదు.
ఇదిలా ఉంటే విజయవాడ గ్రేటర్గా మారనుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో విలీనం కానున్న 32 గ్రామాల్లో రియల్ ఎస్టేట్కు రెక్కలు వచ్చాయి. రాజధాని ప్రకటనతో విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఇప్పటికే భూములు రేట్లు ఆకాశాన్ని అంటుతున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ నుంచి వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలు విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నూతన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడంతో ఇళ్ల అద్దెలు కూడా భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం పలు బహిరంగ సభల్లో విజయవాడ, గుంటూరు వాసులను అద్దెలు తగ్గించాల్సిందిగా విజ్ఞప్తి చేసిన సందర్భాలు అనేకం.
మరోవైపు రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే సెటిలయ్యే వారి సంఖ్య భారీగా పెరగడంతో విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాల్లో ఖాళీ స్థలాలు, ఆపార్ట్మెంట్ల కొనుగోళ్లు ఒక్కసారిగా ఊపందుకున్న సంగతి తెలిసిందే.