జూన్లో షురూ: 2019కల్లా బెజవాడలో మెట్రో రన్
హైదరాబాద్: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్) ప్రభుత్వానికి అందింది. నగరంలో రెండు కారిడార్ల పరిధిలో 26.03 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైలు పరుగులు తీయనుంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి దాదాపు రూ.6,823 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ప్రాజెక్టు డీపీఆర్ను ఢిల్లీ మెట్రో రైలు సంస్థ గడువులోగా పూర్తి చేసింది. వచ్చే జూన్లో మెట్రో పనులు మొదలు కానున్నాయి.
నాలుగేళ్లలో పూర్తవుతుంది. కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ప్రాజెక్టుపై అందిన నివేదిక ప్రకారం 2019 జనవరి నాటికి మెట్రో మొదటి దశ పూర్తవుతుందన్నారు. వచ్చే మంత్రివర్గ భేటీలో మెట్రో రైల్ ప్రాజెక్టు నివేదికను ఆమోదించనున్నారు.
మొదటి కారిడార్ పండిట్ నెహ్రూ బస్ టర్మినల్ నుంచి బందరు రోడ్డు మీదుగా పెనమలూరు వరకు 12.76 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కారిడార్లో 12 రైల్వే స్టేషన్లను నిర్మిస్తారు. రెండవ కారిడార్ పండిట్ నెహ్రూ బస్ టెర్మినల్ నుంచి నిడమనూరు వరకు 13.27 కిమీ వరకు ఉంటుంది. మొదటి కారిడార్ను ఆంధ్ర రాజధాని అమరావతికి కలుపుతారు. ఈ కారిడార్లో 13 రైల్వే స్టేషన్లు ఉంటాయి.
రెండు కారిడార్లు నెహ్రూ బస్స్టేషన్ నుంచే ప్రారంభమవుతాయి. మొదటి కారిడార్ను కృష్ణా నది రైల్వే బ్రిడ్జికి రెండు వందల మీటర్ల దిగువకు పొడిగించి అక్కడి నుంచి కుడివైపు నుంచి అమరావతి (తుళ్లూరు ప్రాంతం)కి కలిపే విధంగా ప్రతిపాదించారు. రెండో కారిడార్ను గన్నవరం విమానాశ్రయంతో అనుసంధానిస్తారు. ఈ కారిడార్ నెహ్రూ బస్స్టేషన్ నుంచి ప్రారంభమై ఉత్తరాన కనకదుర్గ ఆలయానికి, గొల్లపూడి వరకు కలుపుతారు.

రెండు కారిడార్ల పొడవు మొత్తం 26.03 కిమీ. ప్రతి కిలోమీటర్ నిర్మాణానికి దాదాపు రూ.209 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. మెట్రో ప్రాజెక్టు విస్తరణ అనేది రాజధాని అమరావతి నగరాభివృద్థిని బట్టి ఉంటుందని మెట్రో రైల్ ప్రధాన సలహాదారు శ్రీధరన్ సీఎం చంద్రబాబుకు వివరించారు.
అదే భూగర్భంలో మెట్రో రైలు నిర్మాణాన్ని చేపడితే ప్రతి కిలోమీటర్కు ఐదు నుంచి ఆరు వందల కోట్లు ఖర్చవుతుంది. మెట్రో రెవెన్యూ గురించి మాట్లాడుతూ మొదటి ఐదు కిమీ వరకు టిక్కెట్ పది రూపాయలు, ఐదు నుంచి 10 కిమీ వరకు 20 రూపాయలు, 10 కిమీ పైన ప్రయాణానికి టిక్కెట్ 30 రూపాయలు నిర్ణయిస్తారు.
మెట్రో రైలులో 3 బోగీలుంటాయి. గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణికులను చేరవేస్తాయి.
విజయవాడ మహానగరంలో మెట్రో రైల్వే రెండు కారిడార్లకు సంబంధించి మొత్తం 31.029 హెక్టార్ల భూమి అవసరం కానుంది. ఇందులో ప్రభుత్వ, ప్రయివేటు భూములున్నాయి. మెట్రో రైల్ డిపోకు 11.34 హెక్టార్ల భూమి అవసరం. మెట్రో రైలు మార్గం పొడవునా ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించి మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సేకరించవచ్చని నివేదికలో శ్రీధరన్ పేర్కొన్నారు.
భూమి, ఎస్టాబ్లిష్మెంట్కు రూ.320 కోట్లు కావచ్చని అంచనా. మెట్రో రైలు నిర్మాణం తొలి దశ జూన్ నుంచి ప్రారంభించాలని శ్రీధరన్ సిఫార్సు చేశారు. ఈ నివేదిక ప్రకారం 2019-20 సంవత్సరంలోనే మెట్రో దాదాపు 2.91 లక్షల ట్రిప్పులు తిరుగుతుంది. 2051-52 నాటికి 9.99 లక్షల ట్రిప్పులకు పెరుగుతుంది. ఈ ఏడాది జూన్ 15 నాటికి విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు నివేదిక పూర్తవుతుందని శ్రీధరన్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications