పట్టాభి ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్ట్-సగం మంది మహిళలే- భార్య చందన ఫిర్యాదుతో
సీఎం జగన్, డీజీపీ సవాంగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై దాడి కేసులో పోలీసులు చర్యలు తీసుకుంటారు. పట్టాభి వ్యాఖ్యల తర్వాత విజయవాడ డైరీ ఆఫీసర్స్ కాలనీలోని ఆయన ఇంటిపై వైసీపీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న కొందరు దాడి చేశారు. దీంతో పోలీసులు దాదాపు 10 మందికి పైగా నిందితులుగా గుర్తించారు.
పట్టాభి ఇంటిపై జరిగిన దాడిపై ఆయన భార్య చందన విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఇప్పటికే నిందితులుగా గుర్తించిన 11 మందిని అరెస్టు చేశారు. పట్టాభి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిని అరెస్టు చేసినట్లు విజయవాడ పోలీసులు ప్రకటించారు. ఈ 11 మంది వివరాలను ఇవాళ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇందులో సగం మంది మహిళలే ఉన్నారు. నిందితుల్లో బావాజీ పేటకు చెందిన బచ్చు మాధవీకృష్ణ, ఉడ్ పేటకు చెందిన ఇందుపల్లి సుభాషిణి, గుణదలకు చెందిన తుంగం ఝాన్సీరాణి, గుణదలకే చెందిన బేతాల సునీత, క్రీస్తురాజపురానికి చెందిన యల్లాటి కార్తీక్, గొల్ల ప్రభుకుమార్, వంకాయలపాటి రాజ్ కుమార్, బచ్చలకూరి అశోక్ కుమార్, వినుకొండ అవినాష్, సీతారామపురానికి చెందిన గూడవల్లి భారతి, దండు నాగమణి ఉన్నారు.
పట్టాభి భార్య ఇచ్చిన ఫిర్యాదు విచారణలో భాగంగా ఘటనా స్ధలంలో లభించిన ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్, పటమట పోలీసులకు స్ధానికులు ఇఛ్చిన సమాచారం ఆధారంగా వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో పట్టాభి ఇంటి సీసీ కెమెరాల డీవీఆర్ ఇమ్మని నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అది అందాక విచారణ మరింత వేగవంతం అవుతుందన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితుల్ని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.