గౌతంరెడ్డి ఎఫెక్ట్: బెజవాడలో ఉద్రిక్తత, కన్నీళ్ళు పెట్టుకొన్న రాధా
విజయవాడ: విజయవాడ వైసీపీలో రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. విజయవాడలోని మొగల్రాజపురంలోని వంగవీటి రాధ ఇంటి వద్ద ఆదివారం నాడు ఉద్రిక్తత నెలకొంది. వంగవీటి రాధాను పోలీసులు అరెస్ట్ చేశారు.
దివంగత వంగవీటి రాధా, ఆయన సోదరుడు రంగాలపై వైసీపీ నేత గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి వంగవీటి రత్నకుమారి అనుచరులు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను ఖండించే నిమిత్తం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. విజయవాడలోని మొగల్రాజపురంలోని తమ నివాసం నుంచి రాధ, రత్నకుమారి బందర్ రోడ్డులోని వైసీపీ కార్యాలయానికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో, రాధా నివాసం వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులతో రాధా, రత్నకుమారి వాగ్వాదానికి దిగారు. పోలీసులకు వీరికి మధ్య తోపులాట జరిగింది. దీంతో, రత్నకుమారి సొమ్మసిల్లి పడిపోయారు.
ఈ తోపులాటలో రాధ, రత్నకుమారి కిందపడిపోయారు. రాధా వేసుకున్న చొక్కా చిరిగిపోయింది. తన తల్లి కిందపడిపోవడంతో రాధా కన్నీరు పెట్టుకున్నారు. కాగా, రాధాను అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వంగావీటి రంగా అభిమానులు, వంగవీటి రంగా కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంగవీటి రాధా, రత్నకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో విజయవాడ ప్రెస్క్లబ్లో కాపు నేతలు సమావేశమయ్యారు.