విజయవాడలో ఆ వాహనాలకు పోలీసుల షాక్..! బీ అలర్ట్..!
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే విజయవాడ నగరంలో పోలీసులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. మోటారు వాహన చట్టంలోని నిబంధనలన్నీ వెలికితీసి మరీ వాహనదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. ఈ మధ్యే హెల్మెట్లు, సీట్ బెల్ట్ లు, ఇతర ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధిస్తున్న పోలీసులు ఇప్పుడు వాహనదారులకు మరో షాకిచ్చారు. ఈ మేరకు ఇవాళ్టి నుంచే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు.
విజయవాడలో ఇప్పుడు ఎక్కడ చూసినా వాహనాలకు కాన్వాయ్ సైరన్లు వినిపిస్తున్నాయి. కేవలం సీఎం, ప్రధాని, అంబులెన్స్, పోలీసు కాన్వాయ్ వాహనాలకు మాత్రమే పెట్టుకోవాల్సిన ఈ సైరెన్లను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. దీనిపై నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. కాన్వాయ్ సైరన్లపై విజయవాడ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇలా ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా ఈ సైరెన్లు వాడుతుండటంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఈ డ్రైవ్ మొదలుపెట్టారు.

ప్రైవేట్ వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సైరన్లు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం హెచ్చరించారు. విజయవాడలో అనధికారికంగా సైరన్లు వినియోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈమేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. అంబులెన్స్, సీఎం, పీఎం, పోలీస్ కాన్వాయ్ కు మాత్రమే నిబంధనల మేరకు సైరన్ వినియోగించే అవకాశం ఉందన్నారు.

కానీ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు నిబంధన విరుద్ధంగా సైరన్లు మోగించడంపై పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. కొంతమంది నాయకుల పేర్లు చెప్పి విజయవాడలో వాహనాలకు ఇష్టానుసారంగా సైరెన్లు మోగిస్తూ తిరుగుతున్నట్లు తెలిసిందన్నారు. అలాగే కొంతమంది ఆకతాయిలు కూడా సైరెన్లు మోగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ భయానక వాతావరణ సృష్టిస్తున్నట్లు గుర్తించామన్నారు. కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా సైరెన్లు ఏర్పాటు చేసుకొని మోగిస్తున్న వారిపై ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ వెల్లడించారు.












Click it and Unblock the Notifications