పరువు-ప్రతిష్ట: రాజధానే కాదు.. హైటెక్ బాబుకు 'బెజవాడ' పరీక్ష!
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు చెబితే హైటెక్ సీఎం గుర్తుకు వస్తారు. విభజన నేపథ్యంలో కొత్త రాజధాని అమరావతి, ఏపీలో అభివృద్ధి బాధ్యత ఆయన పైన పడింది. ఏపీ అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పెట్టుబడులు తెచ్చేందుకు విదేశాలలో పర్యటిస్తున్నారు.
అమరావతి నుంచి పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ తదితరాల పైన చంద్రబాబు దృష్టి సారించారు. సమైక్య ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన తొమ్మిదన్నర సంవత్సరాలు పని చేశారు. అప్పుడే హైటెక్ సీఎంగా పేరు గాంచారు. ఆ పేరు ఆయనకు ఇప్పటికీ దేశవిదేశాల్లో ఉపయోగపడుతోంది.
చంద్రబాబుకు సమస్య పైన సమస్య: జగన్ రెచ్చగొడ్తున్నారా?
దానిని ఉపయోగించుకొని, ఏపీకి పెట్టుబడులు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న ప్రాజెక్టులు చంద్రబాబు ఇమేజ్కి సంబంధించినవిగా చాలామంది చెబుతున్నారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రజల మన్నన పొందుతారని, లేదంటే ప్రజల నుంచి ఛీత్కారం ఎదుర్కోక తప్పదని అంటున్నారు.
విభజన నేపథ్యంలో.. అనుభవజ్జుడనే ఉద్దేశంతో చంద్రబాబుకు ఏపీ ప్రజలు పట్టం కట్టారు. రాజధానితో పాటు ఏపీని ముందంజలో నిలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అమరావతి సహా అన్ని ప్రాజెక్టులు చంద్రబాబుకు చాలా కీలకమని చెప్పవచ్చు. ఇప్పటికే ఏపీ నుంచి పాలన అని చెబుతూ హైదరాబాద్ నుంచి పాలనను తరలించారు.
ఇదిలా ఉండగా, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు ఉవ్వీళ్లూరుతున్నారు. పుష్కరాల నేపథ్యంలో ప్రభుత్వం ముఖ్యంగా రెండు ప్రాజెక్టుల పైన దృష్టి సారించింది. అవి తమ ప్రభుత్వం మైలేజ్కు ఉపయోగపడుతాయని భావిస్తున్నారు.
అమరావతిలో 12వేల క్వార్టర్లు: ఎవరికి ఏ ప్లాట్లు ఇస్తారంటే..
అందులో ఒకటి దుర్గ గుడి ఫ్లై ఓవర్. ఈ ఫ్లై ఓవర్ను పుష్కరాలకు ముందే పూర్తి చేయాలని భావిస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అందుబాటులోకి తేవాలనుకుంటున్నారు. దుర్గ గుడి కోసం ఎప్పటి నుంచే స్థానికుల నుండి డిమాండ్ ఉంది. గత ఎన్నికల సమయంలో టిడిపి దుర్గ గుడి ఫ్లై ఓవర్ నిర్మాణం హామీ కూడా ఇచ్చింది. ఈ ప్రాజెక్టును పుష్కరాలకు ముందే పూర్తి చేయాలని ఉవ్వీళ్లూరుతోంది.
దుర్గ గుడి ప్లై ఓవర్ కాంట్రాక్టర్లకు కూడా ఈ షరతు పైనే పనులు అప్పగించారు. ఆరు లేన్లు పూర్తి చేయడం సాధ్యం కాదని చెప్పడంతో, నాలుగు లేన్ల రోడ్డును పూర్తి చేయాలని సూచించారు. ఈ నెలాఖరుకు అది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి, పుష్కరాలకు వచ్చే భక్తులకు తమ కమిట్మెంట్ తెలియజేయాలనేది చంద్రబాబు అభిప్రాయంగా చెబుతున్నారు.