గుండెజబ్బుతో చనిపోయాక కరోనా నిర్ధారణ- పరామర్శించిన బెజవాడ నేతలకు దడ...
కరోనా పుణ్యమాని గతంలో ఎన్నడూ లేని చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఓ వ్యక్తి చనిపోతే కారణాలు వెంటనే తేలిపోయేవి, కానీ ఇప్పుడలా కాదు. మరణించిన కారణం ఒకటైనా, కరోనా ఉందోమో అని సరిచూసుకోవాల్సిన పరిస్ధితి. ఆ తర్వాత కరోనా ఉన్నట్లు నిర్దారణ అయితే వారితో సన్నిహితంగా మెలిగిన వారి బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. తాజాగా విజయవాడలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
తొలుత గుండె జబ్బు మరణంగానే..
విజయవాడ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన 75 సంవత్సరాల వృద్ధురాలు గుండె జబ్బుతో బాధపడుతోంది. తాజాగా ఈ నెల 11వ తేదీన ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుండె జబ్బు రికార్డులతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు వైద్యులు అదే కోణంలో ఆలోచించి చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో తర్వాత రోజే ఆమె చనిపోయింది. దీంతో వైద్యులు విజయవాడలోని ఆమె నివాసానికి పంపేశారు.
సాధారణంగానే అంత్యక్రియలు..
గుండె జబ్బుతో కన్నుమూసిన వృద్ధురాలిని విజయవాడ తీసుకొచ్చిన ఆమె కుటుంబ సభ్యులు సాధారణ రీతిలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఆమెకు నగరంలో కాస్త పేరు ప్రఖ్యాతులు ఉండటంతో రాజకీయ నేతలు, హితులు, సన్నిహితులు పరిమిత సంఖ్యలోనే అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియలకు ముందు ఎందుకైనా మంచిదని కుటుంబ సభ్యులు శాంపిల్స్ తీయించి కరోనా పరీక్షలకు పంపారు.
కరోనా పాజిటివ్ గా నిర్ధారణ..
అంత్యక్రియలకు ముందు తీసిన శాంపిల్స్ ల్యాబ్స్ కు పంపగా.... రెండు రోజుల క్రితం ఆమెకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. రిపోర్టులు రాగానే అధికారులు ఆమె కుటుంబంలోని 10 మందితో పాటు ఆమెకు సహాయకులుగా ఉన్న ఇద్దరిని క్వారంటైన్ కు పంపారు. అదే సమయంలో వృద్ధురాలి అంత్యక్రియలకు హాజరైన రాజకీయ నేతల్లో ఇప్పుడు దడ మొదలైంది. వారిలో కొందరు ఆమె కుటుంబానికి సన్నిహితంగా ఉన్నవారు కూడా ఉన్నారు. దీంతో వారంతా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వృద్ధురాలి నివాస ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. మరోవైపు కరోనా పరీక్ష ఫలితాలు వచ్చే వరకూ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించకుండా ఉండాల్సిందని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.