వాలంటీర్ల నియామకంపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ నెలా గ్రామ,వార్డు వాలంటీర్ల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఖాళీ పోస్టుల వివరాలను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు జిల్లాల జాయింట్ కలెక్టర్లకు అందించాలని ఆదేశించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ నవీన్కుమార్ జాయింట్ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ,వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఉత్తర్వుల్లో హెచ్చరించారు.
Recommended Video
ప్రతీ నెలా ఆలోగా...
ప్రతి నెలా 1వ తేదీ నుంచి 16వ తేదీ లోగా జిల్లాల పరిధిలో ఉండే వాలంటీర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల ద్వారా ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.60 లక్షల మంది వాలంటీర్లు ఉండగా.. ప్రస్తుతం 7,120 వలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో 5,154 గ్రామ వలంటీర్ పోస్టులు కాగా... 1,966 వార్డు వలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
ఆ ప్రచారంలో నిజం లేదు...
35 ఏళ్లు నిండిన గ్రామ,వార్డు వాలంటీర్లను ప్రభుత్వం తొలగిస్తోందని జరుగుతున్నప్రచారంలో నిజం లేదని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ నవీన్కుమార్ స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. ఆ కథనాలను నమ్మవద్దని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైన ఆరుగురిని తొలగించడానికి చర్యలు చేపట్టగా... దాన్ని మొత్తం వాలంటీర్ వ్యవస్థకు ఆపాదించి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 35 ఏళ్లు నిండిన వాలంటీర్లను ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించట్లేదని తెలిపారు.
గతేడాది నియామకాలు...
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ గడపకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతేడాది అగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 2.60లక్షల మందిని గ్రామ, వార్డు వాలంటీర్లుగా నియమించిన సంగతి తెలిసిందే. ప్రతీ 50 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించారు. వలంటీర్ల సంఖ్య ప్రతి జిల్లాలో 20వేల నుంచి 30వేల మంది వరకు ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా వీరంతా ఇంటింటికీ పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలను చేరవేస్తున్నారు. 2021 జనవరి నుంచి రేషన్ సరుకులు కూడా వాలంటీర్లే ప్రతీ ఇంటికీ వెళ్లి అందించనున్నారు. వాలంటీర్ వ్యవస్థ కారణంగా రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించాయి.