ప్రేమ పెళ్లి ఉద్రిక్తత, పెళ్లి కూతురు మాయం
విజయవాడ: కృష్ణా జిల్లాలోని మండవల్లి మండలం పులపర్రులో ప్రేమ జంట వివాహం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల సహాయంతో పెళ్లి చేసుకున్న ప్రేమ జంట వారి సహాయంతోనే గ్రామంలోకి ప్రవేశించారు. దీంతో సోమవారం రాత్రి గ్రామంలో పంచాయతీ పెట్టిన పెద్దలు పెళ్లి కూతురిని మాయం చేశారు.
దీనిపై పెళ్లికొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనేపథ్యంలో విచారణకు వచ్చిన పోలీసులను గ్రామస్తులు నిర్బంధించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు చొరవ తీసుకోవడంతో పోలీసులను గ్రామస్తులు విడిచిపెట్టారు. అయితే, ఇప్పటికీ పెళ్లికూతురు ఆచూకీ తెలియలేదు.
బ్యాగ్లో శిశువు మృతదేహం
గుంటూరులోని రైల్వేస్టేషన్లో కొద్దిసేపటి క్రితం ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. ఒకటవ ప్లాట్ఫాంపై గుర్తుతెలియని బ్యాగ్ ఉండటాన్ని ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తనిఖీలు చేపట్టిన పోలీసులు బ్యాగ్లో శిశువు మృతదేహాన్ని కనుగొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కర్నూలు జిల్లాలోని చాగలమర్రి హైవేపై కొద్దిసేపటి క్రితం లారీ-బొలెరో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు చిత్తూరు జిల్లా పీలేరు వాసులు బషీర్, కార్తీక్గా పోలీసులు గుర్తించారు.
తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం బైపాస్ రోడ్డులో వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.