JD ఎంట్రీతో మరి ఆయన ఎక్కడి నుంచి??
సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ లోక్ సభ నుంచి బరిలోకి దిగి రెండున్నర లక్షలకు పైగా ఓట్లు పొందారు. ఆ ప్రభావం తెలుగుదేశం పార్టీపై పడింది. ఎంపీగా బరిలోకి దిగిన బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ 5వే ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఇటీవలే జేడీ మళ్లీ విశాఖ నుంచే పోటీచేస్తానని, అవకాశం ఉంటే ఏదో ఒక రాజకీయ పార్టీ తరఫున బరిలోకి దిగే అవకాశాన్ని కూడా ఆయన కొట్టిపారవేయలేదు.

జేడీకి ఒకవేళ సీటిస్తే భరత్ పరిస్థితి ఏమిటి?
దీంతో జేడీ తిరిగి జనసేనలోకి వెళతారా? లేదంటే తెలుగుదేశం పార్టీలో చేరతారా? అనే సందిగ్ధం రాజకీయ వర్గాల్లో నెలకొంది. తన భావజాలానికి అనుగుణంగా ఉండే పార్టీ తరఫున పోటీచేస్తానన్నారు. తెలుగుదేశం-జనసేన మధ్య పొత్తు కుదిరితే విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ పోటీచేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీచేసిన గీతం విద్యాసంస్థల అధినేత, బాలయ్య చిన్నల్లుడు భరత్ పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.

భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయిస్తే..?
భీమిలీ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీపడతారని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై భరత్ స్పష్టతనివ్వలేదు. ఎమ్మెల్యేగా పోటీచేస్తారా? ఎంపీగా పోటీచేస్తారా? అనే విషయంపై స్పష్టత రాకుండా ఏ నియోజకవర్గమనేది ముందే ఎలా చెబుతామంటూ ఆయన కార్యాలయవర్గం బదులిచ్చింది. పొత్తు కుదిరితే కచ్చితంగా ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయన అవుతారంటున్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి జనసేనకే వెళతారా? లేదంటే తెలుగుదేశం పార్టీలో చేరతారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

జేడీ పోటీవల్ల సమీకరణాలు మారతాయి..
లక్ష్మీనారాయణ పోటీవల్ల ఇక్కడ సమీకరణాలు మారతాయి. కచ్చితంగా జేడీయే బరిలోకి దిగుతాడు అని స్పష్టత వస్తే ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. జనసేన నుంచి పోటీచేసినా భారీస్థాయిలో ఓట్లు చీలుస్తారు. అలాకాకుండా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగినా గెలుపు అవకాశాలు ఆయనకు తక్కువ. పొత్తులో భాగంగా జేడీకి టికెట్ కేటాయిస్తే భరత్ పరిస్థితి ఏమిటి? అని తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది కాబట్టి, అప్పటి పరిస్థితిని బట్టి, జనసేనతో పొత్తులు కుదిరే పరిస్థితిని బట్టి సమీకరణాలు అప్పుడు మారతాయని, పొత్తుంటే భీమిలీ నుంచి పోటీ చేయించడం, పొత్తు లేకపోతే ఎంపీగా పోటీచేయించడం జరుగుతోందంటున్నారు. ఏది జరగాలన్నా టీడీపీ-జనసేన పొత్తుపై స్పష్టత వస్తేనే తెలుస్తుంది. అప్పటివరకు వేచిచూడటమే.












Click it and Unblock the Notifications