Yogandhra 2025: యోగాంధ్రకు సర్వం సిద్ధం.. విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
జూన్ 21న జరగబోయే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు విశాఖలోని ఆర్.కే. బీచులో ఏర్పాటు పూర్తయ్యాయి. 'యోగా ఫర్ వన్ ఎర్త్ - వన్ హెల్త్' నినాదంతో ఈ ఏడాది కార్యక్రమం జరగనుంది. సాగరతీరంలో దాదాపు 3 లక్షల మందితో యోగా ఆసనాలు వేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసింది.
విశాఖలోని ఆర్. కే. బీచ్ లో జూన్ 21న జరగబోయే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కొద్ది సేపటి క్రితమే ప్రధాని మోదీ విశాఖకు వచ్చారు. మరోవైపు ప్రధాని మోదీతో కలిసి ఆసనాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖకు చేరుకున్నారు. ఈ క్రమంలో అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
విశాఖ ఆర్కే బీచ్ లోని కాళీమాత ఆలయం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు తీరం వెంబడి యోగాసనాలు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బీచ్ రోడ్డులో 326 కంపార్ట్మెంట్లను సిద్ధం చేశారు.ఇక యోగా వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఒక మ్యాట్, టీషర్టు, ఆహార ప్యాకెట్ ఇవ్వనున్నారు. దాదాపు మూడు వేల వరకు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు.

మరోవైపు ఈ ఏడాది జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నామని ప్రధాని మోదీ తెలిపారు. యోగా ప్రస్థానం విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ యోగా దినోత్సవంలో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలని ప్రధాని కోరారు. అందరం కలిసి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications