విశాఖలో మొదలైన ఉక్కు ఉద్యమం .. ప్రైవేటీకరణ వద్దంటూ కార్మికుల ర్యాలీ, విపక్షాల మద్దతు
ఓవైపు ఢిల్లీలో సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతు నిరసనలు మిన్నంటుతున్న వేళ ఏపీలోని విశాఖలో మరో ఉద్యమం ప్రారంభమైంది.ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో విశాఖలో మరో ఉద్యమం మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజేషన్ చేస్తే ఊరుకునేది లేదని వివిధ పార్టీల నేతలు ప్రజా సంఘాలు రోడ్డెక్కుతున్నాయి. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉక్కు సంకల్పంతో ముందుకు కదలని నిర్ణయం తీసుకుంటున్నాయి.ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు.
"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు".. ప్రైవేటీకరణ ఒప్పుకోం : కేంద్రానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు అల్టిమేటం
Recommended Video
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల బైక్ ర్యాలీ
కూర్మన్నపాలెం నుంచి విశాఖలోని గాంధీ విగ్రహం వరకు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించిన కార్మికులు "విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అంటూ నినదించారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేయబోమని కార్మికులు తేల్చి చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విపక్షాలు, ప్రజా, కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాలని నిర్ణయం తీసుకున్నాయి.
ఉక్కు కర్మాగారంపై 40 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారని గుర్తు చేసిన కార్మిక నాయకులు
విశాఖ ఉక్కు కర్మాగారంపై 40 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారని గుర్తు చేసిన కార్మిక నాయకులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారందరి పరిస్థితి రోడ్డు మీద పడుతుందని చెప్తున్నారు. సంస్థ అప్పుల్లోకి వెళ్లడానికి, నష్టాల్లో కూరుకు పోవడానికి సొంత నిధులు కేటాయించకుండా తీసుకున్న నిర్ణయమే కారణమని వారు పేర్కొంటున్నారు. ఇక ఇప్పటికే టిడిపి విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుల పక్షాన నిలిచి, ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై ఉద్యమించాలని నిర్ణయం తీసుకుంది.
కేంద్రానికి నిర్ణయం ఉపసంహరించుకోవాలని రాజకీయ వర్గాల, ప్రజా , కార్మిక సంఘాల విజ్ఞప్తి
అందులో భాగంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పటికే టిడిపి నేత అయ్యన్నపాత్రుడు కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్రం మనసు మార్చుకునేలా చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కోరారు.
ఇక కార్మిక పక్షాన పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది సిపిఎం. అందులో భాగంగా విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద ఇప్పటికే ఆందోళనలు నిర్వహించిన సిపిఎం ప్రైవేటైజేషన్ పేరుతో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్నారు.
కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయంతో ఉక్కు సంకల్పంతో పోరాటానికి రెడీ
కేంద్రం తన నిర్ణయాన్ని సత్వరం వెనక్కి తీసుకోవాలని, ప్రైవేటైజేషన్ ఆలోచనను విరమించుకోవాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నిర్ణయం మార్చుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను 100% ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న కేంద్రం తీరుపై ఉక్కు సంకల్పంతో పోరాటానికి సిద్ధమవుతున్నారు కార్మికులతో పాటుగా, రాజకీయ, ప్రజాసంఘాల నేతలు.