జగన్ను ఇరుకున పెట్టిన చంద్రబాబు: విష్ణుకుమార్ రాజు రక్షించారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూదందాపై ఆరోపణలు చేసిన సందర్బంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం శాసనసభలో చిక్కుల్లో పడేసినట్లే కనిపించారు. మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు భూములు కొన్నట్లు రుజువు చేయాలని, అందుకు తగిన సాక్ష్యాధారాలు చూపితే ఆ ఇద్దరి మంత్రులను డిస్మిస్ చేస్తానని చంద్రబాబు జగన్కు సవాల్ విసిరారు.
రుజువు చేయలేకపోతే జగన్ క్షమాపణ చెప్పాలని, క్షమాపణ చెప్పిన తర్వాత సభ ముందుకు సాగాలని కూడా చంద్రబాబు ఆవేశంగా అన్నారు. అయితే, రజువులున్నాయని గానీ చూపుతానని గానీ చెప్పకుండా జగన్ భూదందాపై సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. మంత్రులు యనమల రామకృష్ణుడితో సహా అచ్చెన్నాయుడు, టిడిపి శాసనసభ్యులు కూడా ఆరోపణలను రుజువు చేయాలని లేదా జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రులు, టిడిపి సభ్యులు పదే పదే చంద్రబాబు చేసిన సవాల్ను గుర్తు చేస్తూ జగన్ను చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో జగన్ ఆత్మరక్షణలో పడినట్లే కనిపించారు. ఆ స్థితిలో సభ ముందుకు సాగేట్లు కనిపించలేదు. అయితే, ఈ సందర్భంలో బిజెపి సభ్యుడు విష్ణుకుమార్ రాజు జోక్యం చేసుకున్నారు. జగన్ తీరును తప్పు పట్టారు. అమరావతి భూసేకరణ విషయంలో ఏ విధమైన అక్రమాలు జరగలేదని చెప్పారు. తనకు విషం కలిపి ఇచ్చారని, దానిపై విచారణ జరిపించాలని కోరుతానని, వైయస్సార్ కాంగ్రెసు తీరు ఆ విధంగా ఉందని ఆయన అన్నారు.
జగన్ను తప్పు పడుతూనే ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేయాలని ఆయన సూచించారు. దాంతో అధికార తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గినట్లు కనిపించింది. జగన్ కూడా ఆ విషయాన్ని వదిలేసి మరో విషయంపై మాట్లాడడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు నినాదాలు చేశారు.