బాబు మాటలు ఇక నమ్మరు, 2019లో సీఎంను డిసైడ్ చేసేది మేమే: విష్ణుకుమార్ రాజు
విశాఖపట్నం: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. కర్ణాటకలో బీజేపీ గెలుపును అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కుటిల యత్నాలను ప్రజలు తిప్పికొట్టారని ఆయన అన్నారు. బీజేపీకి భారీ మెజార్టీ కట్టబెట్టిన తెలుగువారికి, కన్నడిగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సాక్షాత్తు ఎన్జీవో సంఘంతో తమ పార్టీకి ఓటేయద్దని టీడీపీ ప్రచారం చేయించినా ప్రజలు మోడీకే పట్టం కట్టారని అన్నారు. వచ్చే 2019 ఎన్నికల్లో చంద్రబాబు చెప్పే కల్లబొల్లి మాటల్ని నమ్మడానికి జనం సిద్దంగా లేరని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీఎంను ఎన్నుకునే ప్రక్రియలో బీజేపీ కీలక పాత్ర పోషించనుందని విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు.
టీడీపీకి చరమగీతం పాడారు: మాధవ్
టీడీపీ నీచ, నికృష్ట రాజకీయాలకు కన్నడ తెలుగువారు చరమగీతం పాడారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయించాలనుకున్న టీడీపీ తమ్ముళ్ల పప్పులు ఉడకలేదని పేర్కొన్నారు. కర్ణాటక ప్రజలు ఏకపక్షంగా బీజేపీకే ఓటేశారని అన్నారు. ఇకనైనా చంద్రబాబు విభజన రాజకీయాలు మానుకుని, నిర్మాణాత్మక ధోరణితో వ్యవహరించాలని సూచించారు. కన్నడనాట బీజేపీ విజయం బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని, మానసిక స్థైర్యాన్ని నింపిందని చెప్పుకొచ్చారు.