అద్భుత నగరంగా అమరావతి: దైవ సంకల్పమన్న విశ్వయోగి విశ్వంజీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యద్భుత నగరంగా కీర్తి గడిస్తుందని భగవాన్ విశ్వయోగి విశ్వంజీ అన్నారు. మంగళవారం ఆయన ఓ తెలుగు పత్రికతో మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణం దైవ సంకల్పమని చెప్పారు. యోగులు, దైవాంశ సంభూతుల ఆశీస్సులు ఈ నగర నిర్మాణానికి పూర్తిగా ఉంటాయని తెలిపారు.
యోగశక్తి, గురుశక్తి ఇందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అమరావతి నగర నిర్మాణానికి దేశ, విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రశాంతి నిలయం'గా అమరావతి మారుతుందని, ప్రపంచంలో మంచి గుర్తింపు లభిస్తుందని విశ్వయోగి విశ్వంజీవివరించారు.
భారతదేశాన్ని వేగంగా ముందుకు నడిపిస్తున్న పధాని నరేంద్ర మోడీతో శంకుస్థాపన జరిపించడం హర్షణీయమని విశ్వంజీ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు అక్కడి ప్రజల కోరికని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ ప్రజల కోరిక నెరవేరిందన్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు మంచి రాజధాని నగరం కావాలని కోరుకున్నారన్నారు. వారి కల నెరవేరబోతోందని, అమరావతి నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలు ప్రగతి పథంలో ముందుకువెళతాయని, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటాయని విశ్వంజీ పేర్కొన్నారు. ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే పరస్పర సహకారం అవసరమని, ఇప్పుడు అమరావతికి పూర్తి సహకారం లభిస్తోందని చెప్పారు.