వివేకా హత్యకేసు: రేపు విచారణకు రావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్ళీ సిబిఐ నోటీసులు
కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ అధికారులు మరోమారు నోటీసులు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్లోని కోఠిలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డికి వాట్సప్ ద్వారా సిబిఐ అధికారులు నోటీసులు పంపారు. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి ని సిబిఐ అధికారులు పలుమార్లు విచారించారు. ఇప్పటికి నాలుగు సార్లు సిబిఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ధర్మాసనం సానుకూలంగా స్పందించలేదు. ఇంకా ఏ నిర్ణయం వెల్లడించకపోవడంతో ఆయన అరెస్టు అంశం ప్రస్తుతం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఎంపీ అవినాష్ రెడ్డిని గతంలో విచారించిన సీబీఐ అవినాష్ రెడ్డిపై వివేకానంద రెడ్డి హత్య తో పాటు ఆధారాలను మాయం చేసిన అభియోగాలు మోపింది.
వివేకా హత్య కేసులో కోర్టుకు వెళ్లిన ప్రతిసారి సి.బి.ఐ అనేక సంచలన విషయాలను వెల్లడిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే మళ్లీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుండి ఎంపీ అవినాష్ రెడ్డి కడపకు వెళ్లగా, సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేయడంతో మళ్లీ ఆయన హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు.
ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించారు. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా సిబిఐ కోర్టు దానిని కొట్టివేసింది.












Click it and Unblock the Notifications