వివేకా హత్య .. జరిగింది వాళ్ళ ఊళ్ళో, వాళ్ళ ఇంట్లో .. టీడీపీకి ఏం సంబంధం ..చంద్రబాబు ఫైర్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలను ఉలికిపాటుకు గురి చేసింది. ఈ హత్యోదంతంతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. టీడీపీ పాత్ర ఉందని వైసీపీ అధినేత జగన్, వైసీపీ శ్రేణులు టీడీపీ పై దాడికి దిగుతుంటే, చంద్రబాబు, టీడీపీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. ఈ హత్యపై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు . జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు .
ఎన్నికల నేపధ్యంలో ఏపీ రాజకీయాలు హింసాత్మకంగా కూడా మారనున్నాయి అని తాజా పరిణామాలతో అర్ధం అవుతుంది. ఏపీలో ఎన్నికల సమయంలో వైసీపీ కి చెందిన కీలక నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు , జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. అయితే ఈ హత్యపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని , ఏపీ ప్రభుత్వం పై నమ్మకం లేదని , టీడీపీ నాయకుల పాత్ర వుందని వైసీపీ నేతలు ఆరోపించారు. వై సీపీ అధినేత జగన్ సైతం సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారు. ఇక టీడీపీ , వైసీపీ నేతల మాటల యుద్ధాలు ఈ హత్యోదంతంపై కొనసాగుతున్నాయి.
వివేకా హత్య... ప్రాణం పోయే సమయంలో లెటర్ రాయటం సాధ్యమా ? లేఖ పై వైసీపీ నేతల అనుమానాలెన్నో!
ఏపీలో ఎన్నికల వేళ జరిగిన ఈ హత్య రాజకీయ హత్యగా వై సీపీ నాయకులు ఆరోపిస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హత్యలను కూడా రాజకీయాలు చేస్తున్నారని జగన్ పై మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్య లో చంద్రబాబు కుట్ర ఉంది అంటూ.. శుక్రవారం వైసీపీ అధినేత జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై చంద్రబాబు స్పందించారు. శనివారం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
వివేకా హత్య వాళ్ల ఊళ్లో.. వాళ్ల ఇంట్లో జరిగిందని.. దీనికి టీడీపీని నిందించడం అమానుషమన్నారు. తప్పులు చేసి తప్పించుకోవడం జగన్ దురలవాటని దుయ్యబట్టారు. జగన్ వ్యాపారంలో అయినా , రాజకీయంలో అయినా అడ్డదారి, చెడ్డదారి చూసుకుంటారని ఆరోపించారు. జగన్ ఏరంగంలోకి అడుగుపెడితే.. ఆ రంగంలో అప్రదిష్ట అని చంద్రబాబు వ్యాఖ్యానించారు . రాజకీయ లాభం కోసమే షర్మిలతో పాత కేసులు మళ్లీ పెట్టించారని మండిపడ్డారు. జగన్ ఎన్నికల రాజకీయంలో భాగంగానే కోడికత్తి డ్రామా ఆడారని.. కావాలనే తనపై దాడి చేయించుకున్నారని ఆరోపించారు.ఇప్పుడు ఈ హత్య కేసును టీడీపీ కి ముడిపెట్టి రాజకీయం చెయ్యాలని చూస్తే సహించేది లేదని చెప్పారు సీఎం చంద్రబాబు.