Vande Bharat: వందే భారత్ పై వైజాగ్ తాజా డిమాండ్స్ ..! రైల్వే రియాక్షన్ ఇదే..!
ప్రస్తుతం దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న రైళ్లలో వందే భారత్ (vande bharat) లు మొదటి స్ధానంలో ఉన్నాయి. అందుకే ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్లను కాస్తా కొత్త రూట్లకు కూడా విస్తరించాలని, అలాగే కొత్త హాల్ట్ లు ఇవ్వాలనే డిమాండ్లు కూడా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఏపీలోని విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహించిన రైల్వే వినియోగదారుల కమిటీ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి కీలక డిమాండ్లు వచ్చాయి.
వైజాగ్ నుంచి బెంగళూరు, తిరుపతి వందేభారత్ లు
డీఆర్ఎం లలిత్ బొహ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో విశాఖ నుంచి బెంగళూరు, తిరుపతికి కొత్తగా వందేభారత్ రైళ్లను ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు. విశాఖపట్నం నుండి బెంగళూరు మరియు తిరుపతికి వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలను ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని వారు రైల్వే అధకారులకు గుర్తుచేశారు. అలాగే దువ్వాడ రైల్వే స్టేషన్లో పార్కింగ్ ఛార్జీలను కూడా తగ్గించాలని వారు అధికారుల్ని కోరారు.

స్పందించిన రైల్వే
విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ సహా తొమ్మిది మంది DRUCC సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో వాణిజ్య మండలి, పరిశ్రమలు, సాంస్కృతిక సంఘాలు, గుర్తింపు పొందిన ప్రయాణీకుల సంఘాలు, ప్రత్యేక ఆసక్తి గల సంఘాలు , పార్లమెంటు సభ్యుల నామినీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఇందులో దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు, ప్రత్యేక , సాధారణ రైళ్లు తీసుకురావడం, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు, రైళ్లకు కొత్త పేర్లు, సర్వీసు మెరుగుపర్చడం వంటి పలు డిమాండ్లు వచ్చాయి. అనంతరం స్పందించిన రైల్వే అధికారులు కొత్త వందే భారత్ లు సహా ఇతర డిమాండ్స్ పై అందుబాటులో ఉన్న నిబంధనల పరిధిలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే వీటిపై తగిన చర్యల కోసం సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు పంపుతామన్నారు.












Click it and Unblock the Notifications