గొడుగుతో కరోనాకు దూరం... విశాఖ వైద్యుడి సూచనకు ప్రధాని ప్రశంస..
కరోనాను నియంత్రించేందుకు సామాజిక దూరం పాటించాలన్న అవగాహన ఇప్పుడు దేశ ప్రధాని నుంచి సామాన్యుడి వరకూ వినిపిస్తోంది. అలాగే సామాజిక దూరం పాటించేందుకు చేపట్టాల్సిన చర్యలపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతో దేశంలో ప్రతీ ఒక్కరూ తమదైన రీతిలో సామాజిక దూరం పాటించేందుకు మార్గాలను అన్వేషిస్తూ కొత్త మార్గాలను ప్రతిపాదిస్తున్నారు. ఇదే క్రమంలో విశాఖకు చెందిన ఓ డాక్టర్ ప్రతిపాదించిన సామాజిక దూర సిద్ధాంతం ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ ఆకర్షిస్తోంది. అదేంటో మనమూ తెలుసుకుందాం..
గొడుగుతో సామాజిక దూరం...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేందుకు ప్రజలు తమ చుట్టు పక్కల వారితో దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మనం ఎంత దూరంగా ఉన్నా ఒక్కోసారి చుట్టు పక్కల ఉన్న వారు మనకు సమీపంగా వచ్చేస్తుంటారు. ఇక కుటుంబం, సన్నిహితులు, మిత్రుల సంగతి చెప్పనక్కరలేదు. దీన్ని నివారించేందుకు ప్రతీ ఒక్కరూ గొడుగు వాడాలని విశాఖకు చెందిన డాక్టర్ సూర్యారావు సూచిస్తున్నారు. గొడుగు పట్టుకుంటే వెంటనే మన వద్దకు రావాలంటే పక్కనున్న వారు ఆలోచిస్తారని, ప్రతీ ఒక్కరూ ఇలాగే ఆలోచిస్తే సామాజిక దూరం దానంతట అదే సాధ్యమవుతుందని ఆయన చెబుతున్నారు.
ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లోనూ చర్చ...
సామాజిక దూరం పాటించేందుకు వివిద రాష్ట్రాల నుంచి సూచనలు, సలహాలు కోరుతున్న కేంద్రం.. ప్రముఖులు, ఔత్సాహికుల నుంచి వస్తున్న పలు సూచనలను పరిశీలిస్తోంది. వీటిలో ఎక్కువ మంది ఆచరించే అవకాశం ఉన్న వాటిని పరిశీలించి కరోనాకు వ్యతిరేకంగా చేపడుతున్న ప్రచారంలో వాడుకోవాలని భావిస్తోంది. దీంతో విశాఖ వైద్యుడు సూర్యారావు ప్రతిపాదిస్తున్న గొడుగు సిద్ధాంతం సైతం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో చర్చకు వచ్చింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఈ సూచనను ప్రశంసించారు.
గొడుగును మించిన పరిష్కారం లేదంటున్న డాక్టర్..
ప్రస్తుత పరిస్దితుల్లో కరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే గొడుగు వాడకమే అత్యుత్తమ పరిష్కారమని డాక్టర్ సూర్యారావు చెబుతున్నారు. గొడుగు తెరిచి పట్టుకున్నప్పుడు నాలుగు అడుగులు విస్తరించి ఉంటుందని, చుట్టుపక్కల ఉండేవారు వెంటనే దగ్గరికి రావడం సాధ్యం కాదని ఆయన విశ్లేషించారు. పక్కనే ఉన్న వారు దగ్గినా, తుమ్మినా ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని సూర్యారావు పేర్కొన్నారు. ప్రస్తుతం వేసవి పరిస్ధితుల్లో పేదవారు సైతం అతి తక్కువ ఖర్చుతో గొడుగును కొనుక్కునే వీలుందని డాక్టర్ చెబుతున్నారు. ప్రస్తుతం సూర్యారావు ప్రతిపాదించిన గొడుగు సిద్ధాంతానికి అంతర్జాతీయంగా కరోనాపై పోరాడుతున్న పలువురు ఆకర్షితులవుతున్నారని ఆయన చెప్పారు.
Recommended Video