విశాఖలో పెట్టుబడుల సదస్సు- చంద్రబాబు రికార్డు జగన్ అధిగమిస్తారా ? ఇద్దరికీ తేడా ఇదే..!
విశాఖలో ఎల్లుండి నుంచి రెండురోజుల పాటు పెట్డుబడుల సదస్సు నిర్వహించబోతున్న వైసీపీ సర్కార్.. గతంలో ఇక్కడే మూడు సీఐఐ సదస్సులతో చంద్రబాబు సృష్టించిన రికార్డు అధిగమించాల్సి ఉంది.
విభజన తర్వాత ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు గత 9 ఏళ్లుగా నిరూపిస్తున్నాయి. అయితే అందుకు తగిన పెట్టుబడులు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో ఎల్లుండి నుంచి రెండు రోజుల పాటు విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమైంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇక్కడే వరుసగా సీఐఐ సదస్సుల నిర్వహణతో వచ్చిన పెట్టుబడుల రికార్డును జగన్ సర్కార్ అధిగమించాల్సి ఉంది.

పెట్టుబడుల స్వర్గధామంగా విశాఖ
ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత మారిన పరిస్ధితుల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి విశాఖ గమ్యస్ధానంగా మారిపోయింది. గతంలో అమరావతి రాజధానిగా ఉన్నా, ఇప్పుడు ప్రభుత్వం మూడు రాజధానుల మంత్రం జపిస్తున్నా పెట్టుబడుల ఆకర్షణకు విశాఖను మించిన నగరం మాత్రం కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వాలు మారుతున్న పెట్టుబడులు పెట్టాలంటే మాత్రం విశాఖను చూసి రావాల్సిందే అన్నట్లుగా పరిస్దితి మారిపోయింది. ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం సీఐఐ సాయంతో మూడు పెట్టుబడుల సదస్సులు నిర్వహిస్తే.. ఇప్పుడు జగన్ సర్కార్ సొంతంగానే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహణకు సిద్ధమైంది.

జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
విశాఖలో పెట్టుబడుల ఆకర్షణ కోసం వైఎస్ జగన్ ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా జరిగే ఈ సదస్సుకు విదేశీ పెట్టుబడిదారుల్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే వివిధ రాష్టాల్లో కర్టెన్ రైజర్ ఈవెంట్స్ ఏర్పాటు చేసి మరీ పెట్టుబడిదారుల్ని రమ్మని కోరారు. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వైసీపీ సర్కార్.. భారీగా ఖర్చు కూడా చేస్తోంది. పెట్టుబడులతో వచ్చేవారికి అక్కడికక్కడే ఒప్పందాలు చేసుకుని వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్ ను మీడియాలో కూడా భారీగా ప్రచారం చేయిస్తున్నారు. ఈ సదస్సుతో భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించగలిగితే ఈ మూడున్నరేళ్లలో వచ్చిన అన్ని విమర్శలకూ ఒకేసారి చెక్ పెట్టొచ్చనేది జగన్ ఆలోచన.

గతంలో చంద్రబాబు సీఐఐ సదస్సులు
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు విశాఖలో వరుసగా మూడేళ్లు పెట్టుబడుల సదస్సులు నిర్వహించారు. కేంద్రం, సీఐఐ సాయంతో ఈ పెట్టుబడుల సదస్సుల్ని 2016, 2018, 2018లో నిర్వహించారు. ఈ సదస్సుల్లో దాదాపు రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించుకుంది. అలాగే ఈ పెట్టుబడులన్నీ కార్యరూపం దాల్చితే దాదాపు 25 లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పుకున్నారు. కానీ ఇందులో అతికొద్ది సంస్ధలు మాత్రమే పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని వైసీపీ సర్కార్ రాగానే రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయి. దీంతో ఇప్పుడు కనీసం పెట్టుబడుల ఆకర్షణ రికార్డును అయినా వైసీపీ సర్కార్ అధిగమిస్తుందా లేదా అన్న దానిపై చర్చ జరుగుతోంది.

చంద్రబాబు రికార్డును జగన్ అధిగమిస్తారా ?
విశాఖలో గతంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులతో చంద్రబాబు మూడేళ్లలో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించినట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించేందుకు వైసీపీ సర్కార్ గత మూడేళ్లుగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ప్రతీ ఏటా పారిశ్రామిక విధానాలు ప్రకటిస్తున్నా, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్దానంలో ఉందని చెప్పుకుంటున్నా, పెట్టుబడుల ఆకర్షణలో మాత్రం విఫలమయ్యారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఏడాదిలోకి వెళ్తున్న నేపథ్యంలో భారీగా పెట్టుబడుల ఆకర్షణ ద్వారా విశాఖకు బ్రాండింగ్ తీసుకురావడంతో పాటు విమర్శలకూ చెక్ పెట్టాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. అయితే కేంద్రం నుంచి అంతంత మాత్రంగా అందుతున్న సహకారం, రాజధానిపై అస్పష్టత వంటి అంశాలు జగన్ సర్కార్ కు సవాళ్లు విసురుతున్నాయి.












Click it and Unblock the Notifications