విశాఖలో సీన్ రివర్స్, మారుతున్న లెక్కలు - కలిసొచ్చేదెవరికి..!!
ఏపీ రాజకీయం విశాఖ చుట్టూ తిరుగుతోంది. విశాఖలో దసరా నుంచి తన కార్యకలాపాలు నిర్వహించేదుకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. విశాఖ కేంద్రంగా పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మూడో విడత నిర్వహించారు. చంద్రబాబు విశాఖలో వరుస కార్యక్రమాలతో పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. విశాఖ కేంద్రంగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
విశాఖలో సీఎం జగన్ మకాం: మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను పరిపాలన రాజధాని చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ పరిపాలనా వికేంద్రరణ గురించి సీఎం ప్రస్తావించారు. రాజధానుల వ్యవహారం కోర్టులో ఉండటంతో విశాఖ నుంచి పాలనా వ్యవహారాలు పర్యవేక్షించాలని సీఎం జగన్ నిర్ణయించారు.

దసరా నుంచి వారంలో మూడు రోజులు ముఖ్యమంత్రి విశాఖలోనే మకాం వేసి..అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తారని చెబుతున్నారు. ఇదే సమయంలో అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కొద్ది నెలలుగా చోటు చేసకుంటున్న రాజకీయ పరిణామాల నడుమ జనసేనాని పవన్ విశాఖలో తన కార్యకలాపాలను పెంచారు.
పవన్ యాత్ర వేళ: విశాఖలో గతంలో పవన్ పర్యటించిన సమయంలో వచ్చిన మద్దతు..ఇప్పుడు కనిపిస్తున్న మద్దతులోనూ తేడా ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. పవన్ వారాహి యాత్ర గోదావరి జిల్లాలలో సాగినంత దూకుడుగా విశాఖ జిల్లాలో జరగలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేవలం రెండు సభలతోనే సరి పెట్టారు. రుషికొండ వద్ద పవన్ హడావుడి చేసినా..అక్కడ నిర్మాణాల విషయంలో వచ్చిన స్పందనతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే వాదన మొదలైంది.

ఇక, పవన్ విశాఖ పర్యటనలో సీఎం జగన్ ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకొని మాట్లాడటం..ఆరోపణలు చేయటం మినహా విశాఖకు కావాల్సింది ఏంటి..తాను చేసేది ఏంటనేది స్పష్టం చేయటంలో విఫలమయ్యారనే వాదన ఉంది. ఈ రోజు (19 వ తేదీ) వరకు యాత్ర ఉంటుందని చెప్పినా..ముందు రోజే యాత్ర ముగించారు.
చంద్రబాబు సభకు లేని స్పందన: ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు ఆగస్టు 15న విశాఖ కేంద్రంగా భారీ కార్యక్రమానికి ప్లాన్ చేసారు. నగరంలో ర్యాలీ నిర్వహించారు. విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేసారు. కానీ, ఆ కార్యక్రమానికి కనీస స్పందన రాలేదు. ఖాళీ కుర్చీలతో సాగిన చంద్రబాబు డాక్యుమెంట్ ఆవిష్కరణ వీడియోలు వైరల్ అయ్యాయి.

అదే కార్యక్రమంలో చంద్రబాబు ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చదవాలని చేసిన వ్యాఖ్యలను నెటిజెన్లు ట్రోల్ చేసారు. వైసీపీ నేతల తీరుతో విశాఖ వాసులు ఇబ్బందులు పడుతున్నారని..రాజకీయంగా పట్టు సాధించేందుకు చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. దీంతో, మరి ఇప్పుడు విశాఖ వాసులు ఎన్నికల సమయానికి ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications