స్టీల్ ప్లాంట్ మంటలు- మోడీ అపాయింట్మెంట్ కోరిన జగన్- అఖిలపక్షంతో కలిపి
విశాఖ స్టీల్ ప్లాంట్ వంద శాతం ప్రైవేటీకరణ తప్పదంటూ కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంటులో తేల్చేసిన నేపథ్యంలో విశాఖలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికసంఘాలు చేపడుతున్న నిరసనలు తారా స్ధాయికి చేరడంతో వైసీపీ ప్రభుత్వం ఇరుకున పడింది. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు తమ వద్ద ఉన్న వ్యూహాలు పంచుకునేందుకు అపాయింట్మెంట్ కావాలని ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే కార్మికసంఘాలు, అఖిపక్షంతో వచ్చి కలుస్తానని తెలిపారు.
ఏపీ న్యాయ రాజధాని అదే- ఆర్ధికమంత్రి బుగ్గన ప్రకటన- జగన్ పేరు కలిసొచ్చేలా
ప్రధాని అపాయింట్మెంట్ కోరిన జగన్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదంటూ నిన్న పార్లమెంటులో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సీఎం జగన్ ఇవాళ మరోసారి ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇప్పటికే ప్రేవేటీకరణ ఆపాలంటూ, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా సూచిస్తూ లేఖ రాసిన జగన్.. ఇవాళ అపాయింట్మెంట్ కోరుతూ మరో లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వెళ్లకుఁడా తమ వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని, వాటిని వివరించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధాని మోడీని జగన్ కోరారు.
విశాఖ ఉక్కు ప్రత్యేకతను గుర్తు చేసిన జగన్
విశాఖ ఉక్కు ప్లాంట్ ఎన్నో ఉద్యమాల ఫలితంగా సాధించుకున్నదని, నవరత్న సంస్ధల్లో ఒకటని, ఇందులో 20వేల మంది ఉద్యోగులు ప్రత్యక్షఁగా ఉపాధి పొందుతున్నారని ప్రధాని మోడీకి రాసిన లేఖలో జగన్ తెలిపారు. గతంలో ఉక్కు ప్లాంట్ కోసం ఏపీలో జరిగిన ఉద్యమంలో 32మంది చనిపోయారని ప్రధానికి గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ వల్ల స్టీల్తో పాటు ఆటోమొబైల్, ఇతర రంగాలకు కూడా ఎంతో మేలు జరుగుతోందని జగన్ ప్రధానికి తెలిపారు. 2002 నుంచి 2015 వరకూ ఈ ప్లాంట్ లాభాల్లోనే ఉందని కూడా గుర్తు చేశారు. సొంత గనులు లేకపోవడం వల్లే ఆ తర్వాత నష్టాల్లోకి దిగజారిందన్నారు. ప్రైవేటీకరణ చేపట్టకుండా కేంద్రం సహకరిస్తే నష్టాల్లోంచి బయటపడే అవకాశం ఉందని జగన్ తెలిపారు. ఇందు కోసం జగన్ పలు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా సూచించారు.
అఖిలపక్షం, కార్మికులతో కలిసి వస్తానంటూ
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ ఫిబ్రవరి 6న మీకో లేఖ రాశాను, ఆ తర్వాత కేంద్ర ఉక్కు మంత్రికి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశానని సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండానే ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు అన్ని మార్గాలను అందులో ప్రస్తావించినట్లు జగన్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చేసిన ప్రకటనతో ఏపీ ప్రజలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ఇతర భాగస్వాములు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారని జగన్ ప్రధానికి తెలిపారు.
తొలిసారి అఖిలపక్షంతో కలిపి అపాయింట్మెంట్ కోరిన జగన్
గతంలో చాలా సమస్యలపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షాతో పాటు కేంద్రంలోని పెద్దలను కలిసిన సీఎం జగన్ ఎప్పుడూ అఖిలపక్షంతో కలిసి వెళ్లేందుకు ఇష్టపడలేదు. కానీ తొలిసారిగా విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మాత్రం అఖిలపక్షం, కార్మికసంఘాలను కూడా తీసుకుని వస్తానంటూ జగన్ ప్రధానిని కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్లో వచ్చిన భారీ మార్పుకు ఇది నిదర్శనంగా చెప్తున్నారు. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు సైతం ఇతర పార్టీలను కలుపుకుని వెళ్లేందుకు ఇష్టపడని జగన్.. ఇప్పుడు తొలిసారిగా విశాఖ స్టీల్ ప్లాంట్పై అఖిలపక్షంతో కలిసి అపాయింట్మెంట్ కోరడం ప్రత్యే్కంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ప్రైవేటీకరణ తప్పకపోతే ఇందులో వైసీపీ రాజకీయంగా నష్టపోకుండా ఉండేదుకే జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది.