జనసేనలో చేరిన వైసీపీ కార్పోరేటర్ - పవన్ సమక్షంలో !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి నేతల చేరికలే కొనసాగుతున్నాయి. అలాంటిది ఇవాళ వైసీపీకి చెందిన ఓ కార్పోరేటర్ ఇవాళ జనసేనలో చేరారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేస్తానని పదే పదే చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అన్నట్లుగానే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేసారు. ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న అసంతప్త నేతల్ని తమవైపు తిప్పుకునేందుకు క్షేత్రస్దాయిలో ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా కోనసీమ జిల్లా రాజోలులో వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావును జనసేనలో చేర్చుకున్న పవన్.. ఇవాళ వైజాగ్ లో మరో నేతను పార్టీలోకి ఆహ్వానించారు.
విశాఖపట్నం నగర పాలక సంస్థ జీవీఎంసీలో వైసీపీ కార్పొరేటర్ కందుల నాగరాజు ఇవాళ జనసేన పార్టీలో చేరారు.
మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జనసేన కండువా వేసి కందుల నాగరాజుని పార్టీలోకి ఆహ్వానించారు.దీంతో కందుల నాగరాజు తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు. ఇప్పటికే విశాఖ రాజధాని పేరుతో విపక్షాలను టార్గెట్ చేస్తున్న వైసీపీ నుంచి జనసేనలోకి ఓ కార్పోరేటర్ వచ్చి చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

విశాఖలో మారుతున్న పరిస్ధితుల్లో అధికార పార్టీపై వ్యతిరేకత పెరుగుతోందన్న సంకేతాలు ఉన్నాయి. దీంతో కనీసం మరో మూడేళ్ల పదవీకాలం ఉన్నా వైసీపీ నుంచి జనసేనలోకి కార్పోరేటర్ ఫిరాయించడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు విశాఖలో మరింత మంది వైసీపీ అసంతృప్త నేతల్ని జనసేనలోకి ఆకర్షించేందుకు జనసేన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే అక్కడ జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ వైసీపీని తట్టుకుంటూ క్షేత్రస్దాయిలో పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడు నాగరాజు చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications