మహిళా ట్రైన్సీ ఎస్సై తెగువ- 7 గంటలు శ్రమించి భారీ ట్రాఫిక్ జామ్ క్లియర్-పైడితల్లి జాతరలో
ఏపీలోని విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే పైడితల్లి అమ్మవారి జాతరకు భారీ సంఖ్యలో జనం తరలివస్తుంటారు. 13 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈసారి కూడా జాతరకు భారీగా భక్తులు రావడంతో గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఇదంతా మామూలే అయినా ఈ ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేయడానికి ఓ యువ మహిళా ట్రైనీ ఎస్సై పడిన శ్రమ ఇప్పుడు పోలీసు శాఖతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రశంసలు అందుకుంటోంది.
పైడితల్లి జాతరలో ట్రాఫిక్ జామ్
విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే పైడితల్లి అమ్మవారి జాతర కోసం ఈసారి భారీగా జనం తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. గంటల పాటు భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముందుకూ, వెనక్కీ కదిలే అవకాశం లేక పిల్లలు, పెద్దలు అంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో విజయనగరం జిల్లా రూరల్ పోలీసు స్టేషన్ లో ట్రైనీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి రంగంలోకి దిగింది. సినీ ఫక్కీలో అక్కడ తనదైన పనితీరుతో దుమ్ము రేపింది.
ట్రైనీ ఎస్సీ నసీమా బేగం కఠోర శ్రమ
పైడితల్లి జాతరకు వచ్చిన వారితో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అందులో వేలాది వాహనాలు చిక్కుకున్నాయి. ఈ ట్రాఫిక్ క్లియర్ కావాలంటే రోజులు పడుతుందని అప్పటివరకూ అంతా భావించారు. కానీ విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నసీమా బేగం మాత్రం అలా అనుకోలేదు. ఓసారి రంగంలోకి దిగాక తనదైన శైలిలో రెచ్చిపోయింది. వాహనాల్ని ఒక్కొక్కటిగా క్లియన్ చేస్తూ వెళ్లింది. దీంతో అతి తక్కువ సమయంలోనే పరిస్ధితి అదుపులోకి వచ్చేసింది.
ఏడు గంటల్లో ట్రాఫిక్ క్లియర్
విజయనగరం జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 సంవత్సరాలకు ఒకసారి జరిగే పైడితల్లి అమ్మవారి జాతర లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. 2020 బ్యాచ్ కు చెందిన నసీమ బేగం వి.టి అగ్రహారంలో 13 సంవత్సరాల కొకసారి పైడితల్లి అమ్మవారి జాతర డ్యూటీకి వెళ్లారు. ఒక్కసారిగా సుమారు 80 వేల మంది భక్తులు దర్శనకోసం తరలిరావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. జాతరకు సమీపంలో విధులు నిర్వహిస్తున్న యువ ఎస్ఐ నసీమ బేగం ట్రాఫిక్ జామ్ జరిగిన ప్రాంతానికి చేరుకుని సుమారు ఏడు గంటలకు పైన శ్రమించి ట్రాఫిక్ ని క్లియర్ చేసేసింది.
ప్రశంసల వెల్లువ
పైడితల్లి జాతరకు వచ్చిన వేలాది వాహనాలు రోడ్లపై నిలిచిపోయిన క్రమంలో అరుదైన పనితీరుతో ట్రాఫిక్ క్లియర్ చేసేసిన నసీమా బేగంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ట్రాఫిక్ క్లియర్ చేసే క్రమంలో ఆమెను చూసిన ఎందరో వాహన దారులు ప్రశంసలు కురిపించారు. ఓ యువ ఎస్సై, అందునా మహిళా అధికారిణి సమస్య పట్ల స్పందించిన విధానం, సమస్య పరిష్కరించడం లో చూపిన పట్టుదల అక్కడ ఉన్న వారిని, వాహనదారులను ఎంతగానో ఆకర్షించింది.ఇదే అభిప్రాయాన్ని కొంతమంది సోషల్ మీడియా వేదికగా యువ ఎస్ఐ నసీమ బేగం ను అభినందిస్తూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో వారు కూడా గర్వంగా చెప్పుకుంటున్నారు.