వైసీపీ ఎమ్మెల్యేపై అనుచరుల తిరుగుబాటు - తాడేపల్లికి పంచాయితీ..!
వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేపైన ఆయన అనుచరులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వారంతా తాడేపల్లి చేరుకున్నారు. విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్ర స్వామికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో రాజకీయాలు సొంత పార్టీ నుంచే మొదలయ్యాయి. తాజాగా, మంత్రివర్గ విస్తరణ అనంతరం కొలగట్లకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. జిల్లా నుంచి బొత్సాతో పాటుగా రాజన్న దొరకు మంత్రి పదవులు దక్కటంతో కొలగట్లకు ఛాన్స్ దక్కలేదు.

ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం
అయితే, పార్టీలో సీనియర్ కావటం.. సామాజిక సమీకరణాల్లో భాగంగా డిప్యూటీ స్పీకర్ పదవికి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, నియోజకవర్గంలో జిల్లా పార్టీ ఇన్ ఛార్జ్ తో కలిసి విజయనగరం వైసీపీ నేతలు కొందరు తాడేపల్లికి చేరుకున్నారు. మంత్రి బొత్సాను కలిసారు. నియోజకవర్గంలో పరిస్థితిని వివరించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే నియంతలా వ్యవహరిస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని..పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తున్నారంటూ ఫిర్యాదులు చేసారు.

సీఎంకు వివరించాలంటూ
విజయనగరంలో పార్టీ పరిస్థితిని సీఎం కు వివరించాలని వారు మంత్రి బొత్సాను కోరారు. వచ్చే ఎన్నికల్లో విజయనగరం టికెట్ బీసీలకు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. తమకు సంక్షేమ పథకాలు అందకుండా స్థానిక ఎమ్మెల్యే వీరభద్ర స్వామి అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు. తాము వైసీపీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నామని..స్థానిక ఎన్నికల్లోనూ టిక్కెట్లు రాకుండా అడ్డుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీ కోసం పని చేస్తన్న మద్దతు దారులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు.

సీఎం జగన్ సమీక్షలు
ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని..తమకు న్యాయం చేయాలన్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ.. లోక్ సభ స్థానాలను 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. తిరిగి ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..జిల్లా కేంద్రంలోనే పార్టీలో అంతర్గత విభేదాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు దీని పైన పార్టీ అధినాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. నియోజకవర్గాల వారీగా సమీక్షలు ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి జగన్..ఇటువంటి సమస్యలకు ఎలాంటి ముగింపు ఇస్తారనేది ఇప్పుడు పార్టీలో చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications