తిట్టేవన్నీ తిడుతూనే చంద్రబాబు కష్టాలు పగవాడికి కూడా రావొద్దన్న వైసీపీ నేత
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు టైం ఏమాత్రం బాగోలేదు. గత ఎన్నికల్లో ఓటమి పాలు చేసి ఏపీ ప్రజలు సహకరించకపోగా, ఇప్పుడు ప్రకృతి సైతం చంద్రబాబుకు సహకరించకుండా పోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నన్ని రోజులు వర్షాలు పడని ఏపీలో, ఈసారి ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు వరద పోటెత్తింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని ప్రాజెక్టుల వద్ద గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది .ఇదే సమయంలో చంద్రబాబు నివాసం ఉన్న కృష్ణానది కరకట్ట పై వరద ముంపు పొంచి ఉంది. ప్రకాశం బ్యారేజి వద్ద గేట్లు తెరవడంతో చంద్రబాబు ఇంటికి వరద ప్రమాదం నెలకొంది. దీంతో ఈ అంశాన్ని కూడా వైసిపి నాయకులు వదలకుండా టార్గెట్ చేసి చంద్రబాబును నానా మాటలు అంటున్నారు.

ప్రకృతి ప్రకోపానికి చంద్రబాబు హైదరాబాద్ పారిపోయాడన్న విజయసాయి
ఏపీలో వరదలతో జలాశయాలు నుండి, అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో ఇక ఈ అవకాశాన్ని కూడా వైసీపీ చంద్రబాబుకు వ్యతిరేకంగా చాలా చక్కగా వాడుకుంటుంది. ఇప్పటికే ఏపీ మంత్రులు చంద్రబాబు నివాసానికి వరద ముంపు పొంచి ఉన్న నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ కు పారిపోయారు అంటూ వ్యాఖ్యలు చేయగా, ఇక వరుస ట్వీట్లతో చంద్రబాబుని నానా మాటలు అంటూనే, చంద్రబాబు కి వచ్చిన కష్టం పగవాడికి కూడా రావద్దు వైసీపీ నాయకుడు ఎంపీ విజయ సాయి రెడ్డి సానుభూతి వాక్యాలు పలికారు . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. కృష్ణా నది వరదల అంశం పైన , కరకట్ట మీద లింగమనేని గెస్ట్ హౌస్ అంశం పైన తన ట్వీట్లలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరకట్టను వరద చుట్టుముట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు చేరుకోవడాన్ని ప్రస్తావించిన విజయసాయి చంద్రబాబు అపచారాలకు ఆగ్రహించి కృష్ణమ్మ జల కొరడా ఝుళిపించిందని , ఇసుక దోపిడీ చేసి , నదిని పూడ్చి దీవులను ఏర్పాటుచేసి, గెస్ట్ హౌస్ లు కట్టి నీటి నిల్వను తగ్గించేశారని ఆరోపించారు విజయ సాయి.అంతేకాదు ఉప్పొంగిన నదిని చూసి ప్రజలు సంతోషిస్తే తను మాత్రం హైదరాబాద్లో దాక్కున్నాడంటూ చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు.

మీ ఇల్లు మునిగిపోవటం ఏంటయ్యా .. ?మా ఇంటికి వచ్చి ఉండండయ్యా అంటూ సోషల్ మీడియా ఆడుకుంటుందన్న విజయసాయి
ఇక మరో ట్వీట్లో చంద్రబాబు గారి కష్టాలు పగవాడికి కూడా రావొద్దు అంటూ వెటకారం తో కూడిన సానుభూతిని ప్రకటించారు విజయసాయి. కరకట్ట లోపల నిర్మించిన ఇంటికి వరద ముప్పు ఉందని తెలియడంతో హైదరాబాద్ పారిపోయారన్న ఆయన ఇంటి ఆవరణలోని కార్లు విలువైన సామాగ్రిని మరో చోటకి తరలించారు. ఇప్పుడైనా అర్థమైందా బాబు గారూ నదిని పూడిస్తే ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో? అంటూ చంద్రబాబును ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే విషయంపై ట్వీట్ల పరంపర కొనసాగించిన విజయసాయి చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఎన్నికల్లో ఓటమి పాలైన సమయములో మీరు ఓడిపోవడం ఏంటయ్యా అని అప్పుడు మహిళాకార్యకర్తలతో ఉత్తుత్తి శోకాలు పెట్టించారు. ఇప్పుడు మీ ఇల్లు మునిగిపోవటం ఏంటయ్యా ? వరదలో కొట్టుకు పోతే పోయింది.. మా ఇంట్లో వచ్చి ఉండండయ్యా అని వందలాది మంది బాబుని బతిమిలాడుతున్నట్లు వ్యంగ్య చిత్రాలతో సోషల్ మీడియా ఆడుకుంటోంది అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

విధి విచిత్రంగా ఆడుకుంటుంది .. ప్రకృతితో పట్టుకుంటే మటాషే బాబు అన్న విజయసాయి
ఇక అంతే కాదు నదులు వాగులు తవ్వి ఏ ఇసుక నుంచి ధనరాసులు పోగు చేసుకున్నాడో, ఇప్పుడు అవే ఇసుక బస్తాలతో కరకట్ట కొంపను వరదనుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విధి ఎంత విచిత్రంగా ఆడుకుంటుందో చెప్పడానికి ఈ ఒక్క ఉదంతం చాలు అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రకృతి తో పెట్టుకుంటే మటాషే బాబు అంటూ హేళన చేశారు.
ఐదేళ్లుగా బాబు గారు మూసి ఉంచిన ప్రకాశం బ్యారేజి గేట్లు తెరవడమే ఒక పెద్ద కుట్ర అని రాస్తుందేమో ఎల్లో మీడియా? రాష్ట్రంలో ఎక్కడా భారీ వర్షాలు లేకున్నా బాబు గారు నదుల అనుసంధానం ఇంకా మొదలు కాకున్నా ఇంత వరద ఎలా వస్తుందని చర్చలు పెట్టినా పెడతారు పే రోల్ మేధావులు అన్న విజయ సాయి "ఏడాది క్రితం కృష్ణకు ఇలాంటి వరద వచ్చి ఉంటే మోదీ మెప్పుకోసం మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు కావాలనే లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని విడిచి పెట్టాయని శోకాలు పెట్టేవాడు. పథకం ప్రకారమే తన కొంపను ముంచాలనే కుట్ర పన్నారని కుల మీడియాలో గంటలు గంటలు చెప్పించేవాడు" అంటూ చంద్రబాబు టార్గెట్ గా మాటల తూటాలు పేల్చారు. ఒకపక్క తిట్టేవన్నీ తిట్టి చంద్రబాబును విధి విచిత్రం గా ఆడుకుంటుంది అని, చంద్రబాబు కి వచ్చిన కష్టాలు పగవాడికి కూడా రావద్దు అని పుండు మీద కారం చల్లుతూనే , మందు రాసే ప్రయత్నం చేశారు విజయసాయి.












Click it and Unblock the Notifications