Vyooham: జగన్ సినిమా వాయిదా: రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద అందుకే సెల్ఫీ
అమరావతి: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని రెండు భాగాలుగా తెరకెక్కింది సినిమా. దాసరి కిరణ్ కుమార్ నిర్మాత. ఈ నెల 10వ తేదీన ఫస్ట్ పార్ట్ విడుదల కానుంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామలతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
జగన్ మూవీ.. :ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపుదిద్దుకుంది. వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్ పోషించాడు. వైఎస్ భారతి క్యారెక్టర్లో మానస రాధాకృష్ణన్ నటించారు. ఈ సినిమా షూటింగ్.. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

లోకేష్ లేఖతో.. :వ్యూహం సినిమాను అడ్డుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తాజాగా సెన్సార్ బోర్డుకు లేఖ రాయడం ట్విస్ట్. ఈ సినిమాలో అనేక వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని, అవాస్తవాలను తెరకెక్కించారంటూ ఆయన సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు.
రివైజింగ్ కమిటీకి.. :ఈ లేఖ తరువాత ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ అనుమతి ఇవ్వలేదు. రివైజింగ్ కమిటీకి రెఫర్ చేసింది. రివైజింగ్ కమిటీ సినిమా చూసి, సర్టిఫై చేసిన తరువాత విడుదల అవుతుంది. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. నవంబర్ 10వ తేదీన విడుదల కాకపోవచ్చని పేర్కొన్నారు. రివైజింగ్ కమిటీ సినిమా చూసి, సర్టిఫై చేసిన తరువాత విడుదల అవుతుందని అన్నారు.
అనిపించిందే తీశా..:హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సినిమా విడుదల వాయిదా పడటానికి గల కారణాలను వివరించారు. సెన్సార్ బోర్డ్ అనేది సినిమాను సర్టిఫై చేస్తుందే తప్ప.. దాని విడుదలను ఆపే అర్హత లేదని వ్యాఖ్యానించారు. సినిమా విడుదలను అడ్డుకోలేదని అన్నారు. ఈ సినిమాలో ఎవరినీ కించపర్చే సన్నివేశాలు లేవని, తనకు కనిపించింది, అనిపించింది తీశానని పేర్కొన్నారు.

లోకేష్ లేఖపై..:వ్యూహం సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాయడంపై మాట్లాడారు. మీడియా ద్వారానే ఆ విషయం తనకు తెలిసిందని, లేఖ తనకు అందలేదని ఆర్జీవీ అన్నారు. ఈ లెటర్ వల్లే సినిమా రివైజింగ్ కమిటీకి వెళ్లిందని తాను అనుకోవట్లేదని ఆయన వ్యాఖ్యానించారు.
అడ్డుకోకపోవచ్చు..:కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా సినిమాలు ఉంటేనే సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలుపుతుందని, సమకాలీన రాజకీయ కోణంగా తీసిన సినిమా కాబట్టి విడుదలను ఆపకపోవచ్చని ఆర్జీవీ చెప్పారు. గతంలో తానే తీసిన కొన్ని సినిమాలకు సెన్సార్ సవరణలతో విడుదల చేయడానికి అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.
సెల్ఫీ దిగడంపై..:స్కిల్ స్కామ్లో అరెస్టయిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు బెయిల్ రాకముందు రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆయన అక్కడ ఉన్నప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద సెల్ఫీ దిగడంపైనా రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
అందుకే ఫొటో..:స్కిల్ స్కామ్ మీద తాను వందల కొద్దీ ఇంటర్వ్యూలు ఇచ్చానని, తన అభిప్రాయాన్ని తెలియజేశానని, రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్లి ఫొటో తీసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏముంది? అని ప్రశ్నించారు. తానొక సామాన్యుడిగా రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద ఫొటో దిగానని వివరించారు.












Click it and Unblock the Notifications