23తర్వాత తేలుద్దాం: కిరణ్, మూణ్ణెళ్ల తర్వాత అధినేత్రితో
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ముగిశాక ఏం చేయాలో తేలుద్దామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర కాంగ్రెసు ఎమ్మెల్యేలకు సూచించారు. బిల్లుపై 23వ తేదీలోగా చర్చ ముగిసిన తర్వాత రెండు రోజుల పాటు మేథోమధన సదస్సును నిర్వహించి, భవిష్యత్తు కార్యక్రమం నిర్ణయించుకుందామని చెప్పారు. బిల్లుపై శాసనసభలో చర్చ ముగిసే దాకా ఓపిక పట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారట.
రాష్ట్ర విభజనపై సిడబ్ల్యూసి తీర్మానం చేసిన తర్వాత సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని ఆ ప్రాంత నేతలు బహిరంగంగానే వాపోతున్నారు. పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే వైసీపీ, టీడీపీలతో అవగాహనను కుదుర్చుకున్నారు. ఇందులో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలూ ఉన్నారు.
ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం లేని కొందరు నేతలు మాత్రం తమ రాజకీయ భవిష్యత్తుపై తలలు పట్టుకుంటున్నారు. తమకు దశాదిశా చూపించాలని వీరు ముఖ్యమంత్రిని కలిసిన ప్రతిసారీ కోరుతున్నారు. ఇప్పటి దాకా సిఎం తన మనసులో మాట బయటపెట్టడం లేదు. దీంతో జనవరి 23 తర్వాత ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెడతారని కొందరు, అలాంటి ఆలోచనే లేదని మరికొందరు ఎవరికి వారు భాష్యాలు చెబుతున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కిరణ్ వెంట నడవాలనుకున్న మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి పతాక స్థాయికి చేరుకుంది.
ఇప్పటికే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలతో చర్చలు జరుపుతున్నారట. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలు కిరణ్ దృష్టికి తీసుకెళ్తే... కాస్త ఓపిక పట్టండని వారిని ఆయన బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 23తో బిల్లుపై చర్చకు గడువు ముగుస్తుందని, ఆ తర్వాత సమావేశమై, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుందామని, అప్పటి వరకూ ఎలాంటి ఆలోచనా వద్దని వారికి సూచించారట.
మరోవైపు మూడు నెలల్లో ముఖ్యమంత్రి పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. కానీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కాలేదు. విభజన నిర్ణయం నేపథ్యంలో ఆయన కలిసేందుకు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు ఆమెతో సమావేశమై తీరాల్సిన సందర్భం ఏర్పడింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సిఎంలతో సోనియా శుక్రవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఇందులో పాల్గొనేందుకు కిరణ్ ఢిల్లీకి వెళ్తున్నారు. సుమారు మూడు నెలల తర్వాత సోనియాతో భేటీ కానున్నారు. ఆయన సోనియాగాంధీతో ఏం మాట్లాడతారు? అసలు ఏమైనా మాట్లాడతారా లేక అందరితోపాటు సమావేశంలో పాల్గొని తిరిగి వచ్చేస్తారా? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.