టీడీపీ తెలుగు ద్రోహ పార్టీ...చంద్రబాబు చందాలబాబు:బిజెపి
విజయవాడ:టిడిపి తెలుగు ద్రోహ పార్టీగా...ముఖ్యమంత్రి చంద్రబాబు చందాలబాబుగా మారినట్లు బిజెపి ఎపి ఇన్చార్జి సునీల్ దేవ్ ధర్ చెప్పారు. శనివారం కృష్ణా జిల్లా నూజివీడులో బిజెపి నియోజక వర్గస్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం సునీల్ దియోధర్ నేతృత్వంలో జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలో తప్పిన పిల్లవాడు అందుకు తప్పు తనది కాదని చదువుకునేటప్పుడు కరెంటుపోయిందని, లేదా ఇంకేదో సాకులు చెప్పినట్లు ఎన్నికలు దగ్గరపడగానే చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో విఫలమవ్వడానికి కారణం తాను కాదని, ప్రధాని మోడీ నిధులు ఇవ్వకపోవడం వల్లేనని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేశా చేశారు.
అనంతరం బిజెపి ప్రత్యేకత గురించి వివరిస్తూ ప్రపంచంలోనే అత్యధికంగా ఆన్లైన్ సభ్యత్వాలు కలిగిన పార్టీ తమ పార్టీయేనని చెప్పారు. ప్రజలు కూడా ప్రాంతీయ స్వార్థంతో కాక జాతీయ ఆలోచనతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఆగిరిపల్లి, నూజివీడు తదిదర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు టీడీపీ కార్యకర్తలు బీజేపీలో చేరారు.

మరోవైపు బీజేపీ అంటే భారతీయ పార్టీ + జగన్ పార్టీ + పవన్ పార్టీ అని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అభివర్ణించారు. విజయవాడలోని టిడిపి జిల్లా కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ బిజెపిపై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ నేతలు వైసీపీ, పవన్తో కలిసి కలిసి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని...ఇదే విషయాన్ని తాము సాక్ష్యాలతో సహా చెప్పడం జరిగిందని అన్నారు.
ఇటీవల జరిగిన కాకినాడ సభలో బిజెపి నేత రామ్మాధవ్ తాము టిడిపియేతర పార్టీలతో కలిసి పని చేస్తామని చెప్పడం తో ఈ విషయం నిర్ధారణ అయిందన్నారు.
కన్నా లక్ష్మీనారాయణ, ఐవైఆర్ కృష్ణారావు అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కష్టపడి పని చేస్తుంటే కన్నా విమర్శించడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే స్థాయి రామ్ మాధవ్కు లేదని తేల్చేశారు. బీజేపీ, జగన్, పవన్ పార్టీలకు రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని పంచుమర్తి అనురాధ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications